శశికళకు షాక్: పళని, పన్నీర్లను ఒకటి చేసేందుకు పావులు
జయలలిత మృతి తర్వాత అన్నా డీఎంకే ఛిన్నాభిన్నం అయింది. శశికళ మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామికి ప్రభుత్వ మనుగడపై భయం పట్టుకుందని చెబుతున్నారు.
చెన్నై: జయలలిత మృతి తర్వాత అన్నా డీఎంకే ఛిన్నాభిన్నం అయింది. శశికళ మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామికి ప్రభుత్వ మనుగడపై భయం పట్టుకుందని చెబుతున్నారు.
పన్నీర్సెల్వం శత్రువుగా మారడం వల్ల అన్నాడీఎంకే ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగడం కష్టమని ఆయన వర్గం నేతలు భావిస్తున్నారని అంటున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే తమ రాజకీయ భవితవ్యం గందరగోళంలో పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
పన్నీరుతో సయోధ్య కుదిర్చేందుకు..
అందుకే పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ అటు శశికళకుగానీ, ఇటు ఆమె బంధువు టీటీవీ దినకరన్కు కానీ తెలియకుండా జరుగుతోందని అంటున్నారు.
మంత్రులు మౌనం
జయ ప్రాతినిథ్యం వహించిన ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 12న పోలింగ్ జరుగుతుంది. శశికళ వర్గం తరపున దినకరన్ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం ప్రచారం చేయవలసిన మంత్రులు చాలామంది మౌనంగా ఉంటున్నారు.
శశికళకు షాక్.. నిర్ణయం తీసుకుంటారా?
వీరంతా రహస్యంగా ఓ సమావేశంలో పాల్గొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో చాలామంది పళనిస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. అయితే బాహాటంగా తమ మనసు విప్పి మాట్లాడటానికి భయపడుతున్నారట. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఆర్కే నగర్తో తేలనున్న దినకరన్ భవితవ్యం
దినకరన్ గెలుపోటముల ఆధారంగా ఈ నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలో ప్రస్తుతం ప్రధానంగా డీఎంకే, పన్నీర్ సెల్వంసెల్వం వర్గం మధ్య పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలపైనే దినకరన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.