పన్నీర్ వ్యూహంపైనే అందరి దృష్టి: విలీనంపై తేలేది నేడే, పట్టు సాధిస్తారా?
చెన్నై: తమిళ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. అన్నాడీఎంకేలో ఇరువర్గాల విలీనానికి జరుగుతున్న యత్నాల్లో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం వ్యూహంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పదవిలో మూడుసార్లు కొనసాగిన పన్నీరుసెల్వం మరోసారి అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే, అసలు పన్నీర్ ఏం కోరుకుంటున్నారు? పళనిస్వామి నివాసంలో గురువారం జరగనున్న చర్చల్లో ఆయన వర్గం తీసుకోనున్న నిర్ణయాలు ఏమిటి? తదనంతరం జరిగే విలీనం చర్చలు సాఫీగా సాగుతాయా? ఇరువర్గాల విలీనం సాధ్యమేనా? వంటి అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నుంచి శశికళ, దినకరణ్ బహిష్కరణ, పన్నీరుసెల్వంకు ఆర్థిక మంత్రితోపాటు పార్టీ పగ్గాలు అప్పగించడం జరుగుతాయా? అనే సందేహాలున్నాయి.
కొరవడిన స్పష్టత
ఈ క్రమంలో పన్నీరు సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. అయితే, ఇరువర్గాల నుంచి సానుకూల ప్రకటనల వెల్లడితో తర్వాత ఏం జరగబోతోందనే చర్చలు సాగుతున్నాయి. పళనిస్వామి వర్గం చేసిన ప్రకటనలో పన్నీర్సెల్వం డిమాండ్పై స్పష్టత లేదు. మరోవైపు ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి పదవులకు శశికళ, దినకరన్లు రాజీనామా చేస్తున్నట్లు కానీ, వారిని పార్టీ బహిష్కరించినట్లు కానీ ఎలాంటి ప్రకటనలు లేవు. సాంకేతికంగా ఈ విషయాలకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది.
పన్నీరు అనుకూలంగా మార్చుకుంటారా?
ఈ క్రమంలోనే ఇరువర్గాల నుంచి బుధవారం సానుకూల ప్రకటనలు వెలువడటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం రెండాకుల గుర్తు, కేసుల నుంచి బయటపడటానికే శశికళ వర్గం వేగంగా పావులు కదిపిందని, అందులో భాగంగానే పన్నీర్ డిమాండ్లకు దగ్గరగా ప్రకటనలు చేసిందని సామాజిక మాధ్యమాలతో పాటు, కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇరువర్గాల మధ్య చర్చలు సాఫీగా సాగటానికి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతారా? తన డిమాండ్ను వంద శాతం అమలు చేయమని పట్టుబడతారా? తేలాల్సి వుంది.
శశికళ కుటుంబం బహిష్కరణ?
శశికళ కుటుంబాన్ని అన్నాడీఎంకే పార్టీ నుంచి తొలగించాలన్న ప్రధాన డిమాండ్ను పూర్తిస్థాయిలో మన్నించినట్లు మంత్రి జయకుమార్ ప్రకటనలో లేదు. ఇరువర్గాల మధ్య జరగనున్న విలీన చర్చల్లో పూర్తిస్థాయిలో సాంకేతికంగా కూడా శశికళ కుటుంబాన్ని దూరం పెట్టాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తారా? విడిచి పెడతారా? తేలాల్సి ఉంది.
సీఎం పదవిపై పట్టుబడతారా?
ఇప్పటికే ముఖ్యమంత్రిగా మూడుసార్లు పదవి చేపట్టిన పన్నీర్సెల్వం...ప్రధాన కార్యదర్శి పదవి, మంత్రి మండలిలో తన వర్గానికి కొన్ని స్థానాలను తీసుకుని సర్దుబాటు చేసుకుంటారా? ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబడతారా? అన్నది తేలాల్సి ఉంది.
పన్నీరు పట్టు సాధిస్తారా?
ఇప్పటికే రెండాకుల గుర్తు, కేసుల నుంచి బయటపడటానికే అన్నాడీఎంకే (అమ్మ) వర్గం విలీనానికి మొగ్గు చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పన్నీర్ వర్గం నుంచి ఎలా స్పందిస్తుంది? వీటికి సమాధానాలు లభిస్తే విలీనం చర్చ లు సాఫీగా సాగుతాయా? లేదా అన్నది తేలిపోనుంది. ఒక వేళ చర్చలు సాఫీగా జరిగితే ఆర్థిక మంత్రి, పార్టీ పగ్గాలను పన్నీరుసెల్వం చేపట్టే అవకాశాలున్నాయి. అంతేగాక, శశికళ కుటుంబాన్ని కూడా అన్నాడీఎంకేకు శాశ్వతంగా దూరం చేయనున్నారు. అయితే, పళనిస్వామిని సీఎంగా ఉండేందుకు పన్నీరు అంగీకరిస్తారా? లేక తానే సీఎం కావాలని పట్టుబడతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.