ఔట్ సైడర్స్ నాట్ అలౌడ్: తమిళ గౌరవానికే పెద్దపీట ఆర్కేనగర్ ఎన్నిక ఫలితం
చెన్నై: తమిళనాట 'అమ్మ' ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ స్థాన ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలనే మార్చేస్తుందా? అంటే పరిస్థితులు అలాగే ఉన్నాయని చెప్తున్నాయి. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్ చరిత్రాత్మక విజయం సాధించడంతో తమిళ రాజకీయం సమూలంగా మారిపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రత్యేకించి భావి తమిళనాడు సీఎం కావాలని ఆశలు పెట్టుకున్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తన రాజకీయ వ్యూహం, ఎత్తుగడలు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆర్కేనగర్ ఫలితం సుస్పష్టమైన సంకేతాలనిచ్చింది.
స్టాలిన్ తన వ్యూహాలు పున: రచించుకోవాల్సిందేనా?
అధికార అన్నాడీఎంకే పార్టీలో చీలికలకు తోడు రెండు రోజుల క్రితం ‘2జీ' స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణం కేసులో డీఎంకే ఎంపీ కనిమొళి, నేత ఏ రాజా నిర్దోషులుగా విడుదలైనా.. ఈ కేసు తీర్పు తాలూకు ప్రభావంతో ఆర్కే నగర్ స్థానాన్ని గెలుచుకోగలమన్న స్టాలిన్ అంచనాలను.. పురుచ్చితలైవి అభిమానులైన తమిళులు తారు మారు చేసేశారు. ఈ పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు.. అటు తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాన్ని పున: రచించాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పళనిస్వామి ప్రభుత్వానికి దినదినగండమేనా..
ఇటు ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన వెంటనే పలు జిల్లాల్లోని అన్నాడీఎంకే జిల్లా స్థాయి నేతలంతా దినకరన్ గ్రూపునకు మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే అధికార అన్నాడీఎంకేకు సారథ్యం వహిస్తున్న ఎడప్పాడి పళనిస్వామి - ఓ పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి దినదినగండం నూరేళ్లాయుష్షు అన్న పరిస్థితులు ఎదురవుతాయా? అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భవిష్యత్లో కమలనాథులకు కష్టాలు తప్పవా?
సుదీర్ఘ అనారోగ్యంతో చికిత్స పొందిన జయలలిత గతేడాది డిసెంబర్ ఐదో తేదీన మరణించిన తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళనాట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేంద్రంలోని అధికార బీజేపీ కలలు కన్నది. డీఎంకేతోనూ జత కట్టాలన్న ప్రయత్నాలు కమలనాథులకు కష్టంగా కనిపిస్తున్నది. శశికళకు నిద్ర లేని రాత్రిళ్లు మిగిల్చిన బీజేపీ.. తాజా పరిణామాలతో మున్ముందు తమిళనాడు రాజకీయాల్లో చేదు అనుభవాలను చవి చూడాల్సి వస్తుందా? అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తమిళుల్లోనూ ఆత్మగౌరవానికే మెండుగా ప్రాధాన్యం
గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ ‘అస్మిత' మాదిరిగానే తమిళనాడు ప్రజలు కూడా తమ ఆత్మగౌరవానికే పెద్ద పీట వేస్తారు. తమిళుల గుండెల్లో తిష్ఠ వేసిన ‘ఆత్మగౌరవ' భావన.. వారికి గౌరవ ప్రదంగా భావించే అంశాలను అర్థం చేసుకోవడంలో కమలనాథులు పూర్తిగా విఫలం అయ్యారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్నది. తమిళ రాజకీయ నాయకులు, ఓటర్లు ఎల్లవేళలా ఆత్మగౌరవానికే పెద్దపీట వేస్తారే తప్ప.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఢిల్లీ' నేతల పెత్తనాన్ని సహించరు. ఇది 1960వ దశకంలో సినీ ప్రముఖుడు అన్నాదురై స్థాపించిన డీఎంకే.. తర్వాత అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ హయాం నుంచి ప్రతిసారీ రుజువవుతూనే ఉన్నది.
దినకరన్ ఎన్నికతో తమిళ ‘ఆత్మ గౌరవా'నికి ఇలా ప్రతిష్ఠ
జయలలిత మరణం తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వం.. ఢిల్లీలోని కొందరు నాయకుల ద్వారా తమిళ రాజకీయాల్లోకి చొచ్చుకెళ్లాలని ప్రయత్నించింది. అందుకు అన్నాడీఎంకేలోని శశికళ నటరాజన్ వ్యతిరేకులను తనకు అనుకూలంగా మార్చుకున్నది. కానీ ఆర్కే నగర్ స్థానంలో మెజారిటీ ప్రజలు.. దినకరన్కు మద్దతుగా ఓటేసి తమ ఆత్మగౌరవాన్ని పున: ప్రతిష్ఠించారు. తద్వారా తమ పరిణామాల్లో వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్రంలోని అధికార బీజేపీకి గట్టి సంకేతమిచ్చారు ఆర్కే నగర్ వాసులు.
ఢిల్లీ పాలకులకు తొత్తులుగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం
చెన్నైలోని వేలాయుధన్ అనే ఆటో డ్రైవర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తీకరించడం గమనార్హం. సీఎం ఈ పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం కూడా ఢిల్లీ పాలకులకు తాబేదార్లుగా వ్యవహరించారని విమర్శించారు. తమిళనాడు ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీశారని మండిపడ్డారు. కేవలం టీటీవీ దినకరన్, డీఎంకే మాత్రమే ‘తమిళుల ఆత్మగౌరవాన్ని' పరిరక్షించగలవని తామంతా భావిస్తున్నామని చెప్పారు. ఈ పరిణామం ఈ పళనిస్వామి - ఓ పన్నీర్ సెల్వం సర్కార్ పతనమైతే.. తమిళనాట డీఎంకేకు అన్నాడీఎంకే నేతగా దినకరన్.. నిజమైన పోటీదారుగా నిలుస్తారంటే అతిశయోక్తి కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఎవరూ ఊహించని ఆర్కే నగర్ ఫలితం
ఆర్కే నగర్ విజయం.. అన్నాడీఎంకేకు.. జయలలితకు నిజమైన వారసత్వం ‘చిన్నమ్మ'దేనని రజువు చేసింది. నిజమైన అన్నాడీఎంకేగా శశికళ గ్రూపు తేలుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గమ్మత్తేమిటంటే టీటీవీ దినకరన్ భారీ విజయం సాధిస్తారని ఏ ఒక్కరూ భావించలేదు. కానీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వివిధ పార్టీల కార్యకర్తలు మాత్రం వాస్తవ పరిస్థితిని అంచనా వేశాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. 2016 ఎన్నికల్లో జయలలిత సాధించిన మెజారిటీ కంటే ఎక్కువగా ఆధిక్యత సాధించిన దినకరన్ విజయం సాధారణమైందే కాదు.. తమిళరాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు.
పళని, పన్నీర్ ఇలా జోడీ
అక్రమాస్తుల కేసులో శశికళా నటరాజన్ జైలు పాలైన తర్వాత ఆమె మేనల్లుడు దినకరన్ను అన్నాడీఎంకే నాయకత్వం.. పార్టీ నుంచి బహిష్కరించింది. తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం జోడీ జత కట్టి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో మమేకమయ్యారు. ఆదివారం నాటి ప్రజాతీర్పుతో పలువురు ఎమ్మెల్యే ఆలోచనలు మారిపోయే సంకతేాలు కనిపిస్తున్నాయి. చరిస్మా లేని, దిశా నిర్దేశం చేయగల సామర్థ్యం లేని పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపుతో కలిసి ఉండి రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసుకోవడానికి ఏ ఎమ్మెల్యే సిద్ధంగా ఉండకపోవచ్చు.
అధికార అన్నాడీఎంకేలో దినకరన్ మనుషులు
జయలలిత హయాంలో శశికళ, దినకరన్ అధికార పార్టీలో అన్నీ తామై వ్యవహరించారు. అందువల్లే కిందిస్థాయి నేతలు, కార్యకర్తల్లో దినకరన్, శశికళ పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారు. అధికార అన్నాడీఎంకేలోనూ రహస్యంగా దినకరన్ అభిమానులు ఉన్నారని తెలుస్తోంది. దీన్నిబట్టే ఏ క్షణంలోనైనా అన్నాడీఎంకేలో ముసలం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చిన్నమ్మపై ఇలా మన్నార్ గుడి మాఫియా ముద్ర
శశికళా నటరాజన్, దినకరన్లను అధికారానికి దూరంగా పెట్టడానికి పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపులకు కేంద్రంలోని బీజేపీ వ్యూహాత్మక మద్దతునిచ్చింది. జైలుకెళ్లడానికి ముందు శశికళ తన మనిషిగా సీఎంను చేసిన పళనిస్వామి తర్వాత మాట మార్చేశారు. బీజేపీతో చేతులు కలిపేశారు. తర్వాత కొద్ది రోజులకు పన్నీర్ సెల్వం.. పళనిస్వామితో కలిసిపోయారు. ఆ పై శశికళను మన్నార్ గుడి మాఫియా రాణి అని పేర్కొంటూ పార్టీ నుంచి బహిష్కరించేశారు.
తమిళ రాజకీయాల్లో బయటి శక్తులకు చోటు లేదా?
అయితే భారీ విజయంతో ఆర్కేనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యేగా దినకరన్ గెలుపొందిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇది జరుగుతుందని తనకు ముందే తెలుసునన్నారు. డీఎంకే జాతి వ్యతిరేక పార్టీ అని పేర్కొన్న స్వామి.. పళనిస్వామి. దినకరన్ గ్రూపులను కలిపేందుకు ప్రయత్నిస్తానన్నారు. రెండు గ్రూపులు కలిస్తేనే డీఎంకేను ఎదుర్కోగలవన్నారు. తమిళనాట రాజకీయాలు సంక్లిష్టంగా ఉంటాయని మరోసారి రుజువైంది. గత పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా బయటి వ్యక్తులు వేలు పెట్టాలని ప్రయత్నిస్తే ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయని చెప్తున్నారు.