ప్రధాని నరసింహారావుతో మాట్లాడుతారు: నోరుజారిన మంత్రి, 'చూసి మాట్లాడండి'
చెన్నై: తమిళనాడు మంత్రి దిండుకల్ శ్రీనివాస్ నోరు జారారు. ప్రస్తుత మన ప్రధాన నర్సింహా రావు అంటూ పేర్కొన్నారు. దిండుకల్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడుతూ లోకసభ ఉప సభాపతి తంబిదురై గురించి ప్రస్తావించారు.
ప్రస్తుతం ఆయన పరమత్తి వేలూర్లోప్రజల సమస్యలు వింటున్నారని, మరికాసేపట్లో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం పుదుకోట్టై వెళ్లి తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని నరసింహరావుతో మాట్లాడుతారని చెప్పారు. ఏకంగా ప్రధాని పేరును మార్చి చెప్పడంతో అందరూ విస్తుపోయారు.
అనంతరం మరో కార్యక్రమంలో తంబిదురై, దిండుకల్ శ్రీనివాసన్ పాల్గొన్నారు. అక్కడ దిండుకల్ శ్రీనివాసన్ మాట్లాడేందుకు కుర్చీలో నుంచి లేస్తుండగా.. 'చూసి మాట్లాడండి' అని తంబిదురై సూచన చేశారు.
గతంలోను సదరు మంత్రి ప్రధానిపేరును మోడీకి బదులు మన్మోహన్ సింగ్ అని చెప్పారు. అలాగే మదురైలో జరిగిన బహిరంగసభలో భారతరత్న ఎంజీఆర్అని చెప్పడానికి బదులుగా భారత ప్రధాని ఎంజీఆర్ అన్నారు.