చెప్పుతో కొట్టాలి: యోగిపై కాంగ్రెస్ దినేష్, బీజేపీ గట్టి కౌంటర్, తగ్గిన కాంగ్రెస్ నేత
బెంగళూరు: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పైన కాంగ్రెస్ పార్టీ నేత, కర్నాటక కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు దినేష్ రావు గుండు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న సదరు కాంగ్రెస్ నేతకు నోరు శుభ్రం చేసుకునేందుకు టూత్ బ్రష్లు పంపిస్తామని బీజేపీ యువమోర్చా తెలిపింది.
మరోవైపు, వాటిపై తీవ్ర దుమారం రేగడంతో వెనక్కి తగ్గారు. ఉన్నావ్, కథువా ఘటనల నేపథ్యంలో ఆవేశంలో విమర్శలు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నావ్, కథువా అత్యాచార ఘటనలకు నిరసనగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న దినేష్ గుండు రావు... ఆదిత్యనాథ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యోగీ ముఖ్యమంత్రిగా పనికిరారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఆయనను చెప్పులతో కొట్టాలన్నారు. సదరు ఘటనలో బాలికను రేప్ చేయడమే కాదు అతడి తండ్రిని అరెస్టు చేశారని, అనంతరం అతడు చనిపోయాడన్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం, పోలీసులు సదరు ఘటనలో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు.
దినేశ్రావు ఉపయోగించిన భాష ఏమాత్రం అమోదయోగ్యం కాదని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగిపై ఆయన వాడిన పదజాలం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. ఓ ముఖ్యమంత్రి, నాథ కుటుంబనుంచి వచ్చిన ఓ సాధువుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కర్ణాటకలోని వేలమంది నాథాపంత్ అనుచరులు క్షమించరన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దినేశ్పై, ఆయన పార్టీ సంస్కృతిపై జాలి పడుతున్నాని ట్వీట్ చేశారు. మరోవైపు కర్ణాటక బీజేపీ కూడా ట్విటర్ ద్వారా కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిపాలనలో 3587 అత్యాచారాలు జరిగాయని మరి ఆయన్ను దేనితో కొట్టాలని నిలదీశారు.
తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో దినేశ్ రావు స్పందించారు. యోగీ ప్రభుత్వం చూపిన ఉదాసీనత కారణంగా బాధితుల దుర్భర పరిస్థితిపై మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగంతో తాను అలా మాట్లాడానన్నారు. ఒకవేళ అవి ఆమోదయోగ్యం కాకపోతే వెనక్కుతీసుకుంటున్నానన్నారు. కాగా, కర్నాటక ఎన్నికల నేపథ్యంలోనే విమర్శలు వస్తే, పార్టీకి నష్టమని ఆయన తగ్గి ఉంటారని అంటున్నారు.