తమిళనాడు నాశనమే: శశికళపై డైరెక్టర్ రాజేంద్రన్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా డైరెక్టర్ రాజేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. శశికళపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు రోజు రోజుకు వ్యతిరేక వర్గం పెరిగిపోతుండగా, అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో పన్నీరు తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
ఇప్పటి వరకు శశికళ సీఎం కావడాన్ని సీనియర్ నేతలు మొదలుకుని సినీ నటులు కూడా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ రాజేంద్రన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శశికళపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
శశికళ సీఎం అయితే తమిళనాడును అమ్మేస్తారంటూ నటుడు ఆరోపించారు. మన్నార్గుడి మాఫియాలాగే శశికళ ప్రవర్తిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను. పార్టీ కార్యకర్తలను ఆమె బెదిరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమెకు అవకాశమొస్తే ఆఖరికి ప్రధాని మోడీని కూడా బెదిరించే రకమని ఆయన ఆరోపించారు.
జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా ఎందుకు రిలీజ్ చేయలేదని శశికళను ప్రశ్నించారు. జయ మృతిపై తమకు అనుమానాలున్నాయన్నారు. శశికళను తమిళనాడుకు ఇచ్చిన శాపంగా అభివర్ణించారు.