విద్వేషపూరిత అభియోగాలు: రిపబ్లిక్ టీవీ జర్నలిస్టు బృందంపై ఎఫ్ఐఆర్ నమోదు
ముంబై: రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్కు చెందిన నలుగురు జర్నలిస్టులు, ఇతర ఎడిటోరియల్ సిబ్బందిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ ప్రతిష్టతకు భంగం కలిగించడంతోపాటు పోలీసులు మధ్య అసమ్మతి రగిలించేందుకు ప్రయత్నించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నిరంజన్ నారాయణస్వామి, డిప్యూటీ ఎడిటర్ శావన్ సేన్, యాంకర్ శివానీ గుప్తా, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ సాగరిక మిత్రా, న్యూస్ రూమ్ ఇంఛార్జ్, ఇతర ఎడిటోరియల్ సిబ్బందిపై ఈ కేసులు నమోదు చేశారు.
కాగా, మహారాష్ట్రలో మీడియా స్వేచ్ఛపై దాడి దాడి జరుగుతోందని, దీనిపై శాయశక్తులా పోరాడతామని రిపబ్లిక్ టీవీ యాజమాన్యం స్పష్టం చేసింది. ముంబై నగర్ కమిషనర్పై సీనియర్ అధికారుల తిరుగుబాటు చేశారంటూ రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన ఓ కథనానికి సంబంధించి ముంబైలోని ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు.
స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ శశిశకాంత్ పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిపబ్లిక్ టీవీ బృందంపై ఈ కేసులు నమోదు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ అనుమానాస్పద మృతిపై రిపబ్లిక్ టీవీ అనేక కథనాలు ప్రసారం చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ ది హత్యేనని, పోలీసులు, ప్రభుత్వం సరైన రీతిలో దర్యాప్తు చేయడం లేదనే రీతిలో కథనాలను ప్రసారం చేసింది.
Recommended Video
ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. సుశాంత్ మృతితోపాటు పలు విషయాలపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ముంబైలోని భవనాన్ని విధ్వంసం చేసింది ముంబై నగరపాలక సంస్థ. ఈ క్రమంలో ఆమెకు మద్దతుగా కూడా రిపబ్లిక్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే తమపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని రిపబ్లిక్ టీవీ యాజమాన్యం ఆరోపిస్తోంది.