ఆటోమొబైల్ పరిశ్రమ కోలుకుంటుందా: సెప్టెంబర్ నెలలో దారుణంగా పడిపోయిన సేల్స్
దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న పరిశ్రమ తాజాగా సియామ్( సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చురర్స్ ) విడుదల చేసిన డేటా మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సెప్టెంబర్కు సంబంధించిన సేల్స్ డేటాను ఆ సంస్థ విడుదల చేసింది. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు భారీగా పడిపోయాయని 23.69శాతంకు చేరుకున్నాయని తెలిపింది. ఇక కమర్షియల్ వాహనాల అమ్మకాలు 62.11 శాతంకు పడిపోయినట్లు సియామ్ వెల్లడించింది.
ఆటోమొబైల్ సెక్టార్కు బూస్ట్.. ట్యాక్స్ తగ్గించే యోచనలో జీఎస్టీ కౌన్సిల్...
వరుసగా 11వ నెలలో కూడా నష్టాలే..
ఇక తాజా గణాంకాలను చూస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీ వరుసగా 11వ నెలలో కూడా నష్టాలను మూటగట్టుకున్న విషయం అర్థమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా ఈ సారి ఆటోమొబైల్ ఇండస్ట్రీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. గతేడాది సెప్టెంబర్లో ప్యాసింజర్ వాహనాలు 2,92,660 యూనిట్లు సేల్ కాగా ఈసారి మాత్రం ఆ సంఖ్య 2,23,317 మాత్రమే ఉన్నట్లు సియామ్ తెలిపింది. ఒక్క ప్యాసింజర్ కార్లు మాత్రమే 33.4శాతంకు పడిపోయాయి. అంటే 131,281 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు సియామ్ వెల్లడించింది.
ఉద్యోగాల్లో భారీ కోత
గత కొన్ని నెలలుగా వాహనాల కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సేల్స్ పడిపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన పరిశ్రమ... ఉద్యోగాలకు కూడా భారీ కోత పడింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆటోమొబైల్ పరిశ్రమలో 3.5 కోట్లు ఉద్యోగాలు ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో సగంకు పైగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తోడ్పడుతోంది. ఇక ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కొన్ని పరిశ్రమలు నాన్ వర్కింగ్ డేస్ను ప్రకటించాయి. ఇందులో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ , అశోక్ లేలాండ్ వంటి ప్రముఖ సంస్థలున్నాయి. కార్మికులకు ఎలాంటి వేతనం ఇవ్వకుండా బలవంతపు సెలవుపై పంపిస్తున్నాయి యాజమాన్యాలు. దీంతో ఉత్పత్తి తగ్గుతుందని భావిస్తున్నాయి.
ఎగుమతి విషయంలో కాస్త ఊరట
ఇక ప్యాసింజర్ వాహనాల తయారీ 18శాతం తగ్గిపోయి ఈ సెప్టెంబర్ నెలకు గాను 2,79,644 వాహనాలు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇదే గతేడాది చూస్తే 3,41,539 వాహనాల ఉత్పత్తి జరిగినట్లు సియామ్ వెల్లడించింది. ఇక కమర్షియల్ వాహనాల ఉత్పత్తి గతేడాది సెప్టెంబర్ నెలలో 72.07శాతం ఉండగా ఈ ఏడాది మాత్రం 45.06శాతంకు పడిపోయినట్లు సియామ్ వెల్లడించింది. ఇక ఎగుమతి విషయంలో మాత్రం కాస్త ఊరటనిచ్చింది . ప్యాసింజర్ వాహనాలు ఎగుమతి శాతం 5.64కు పెరిగినట్లు సియామ్ పేర్కొంది.