మోడీతో వెళ్లిన ఆ ప్రైవేటు వ్యక్తులెవరో చెప్పండి: సీఐసీ ఆదేశం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనతో పాటు ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఎవరో చెప్పాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) విదేశాంగ శాఖను ఆదేశించింది. ఈ మేరకు దీనికి సంబంధించి కమిషన్ వద్ద దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సీఐసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015-16, 2016-17 సంవత్సరాల్లో చేసిన విదేశీపర్యటనలు, అందుకు అయిన ఖర్చు, ఆయనతో పాటు విదేశాలకు వెళ్లిన వ్యక్తుల వివరాలు తెలియజేయాలంటూ కరబీ దాస్ అనే వ్యక్తి గత అక్టోబరులో సమాచారహక్కు చట్టం ద్వారా విదేశాంగ శాఖను కోరారు. దీనికి సంబంధించి విదేశాంగ శాఖ ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చులను చెప్పింది.
అయితే ఆయనతో పాటు వెళ్లిన వ్యక్తుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో కరబీదాస్ కేంద్ర సమాచార కమిషన్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐసీ విదేశాంగశాఖను వివరణ కోరింది.
కాగా, తమ వద్ద ప్రధాని మోడీ విదేశీ పర్యటనల తేదీలు, పర్యటించిన ప్రాంతాల వివరాలు, ఖర్చులు మినహా ఇతర సమాచారం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే, ఇందుకు సీఐసీ విభేదించింది.
'ప్రభుత్వ ఖర్చులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంట విదేశాలకు వెళ్లిన అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తుల వివరాలను కూడా దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా చెప్పాల్సిందే' అని సీఐసీ చీఫ్ ఆర్కే మధుర్ తేల్చి చెప్పారు. దీనిపై విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది.