మాల్యాకు మరో దెబ్బ: విదేశీ ఆస్తులూ వెల్లడించాలన్న సుప్రీం
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది.
తనని అరెస్ట్ చేస్తారనే భయంతోనే భారత్కు రావడం లేదంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు మంగళవారం కొట్టివేసింది. విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందేనని విజయ్ మాల్యాను ఆదేశించింది.
మాల్యా విదేశీ ఆస్తులతోపాటు తన కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ ఆస్తుల ప్రకటనలో ఎలాంటి జాప్యం చేయవద్దని, ఈ వివరాలను గడువులోగా బ్యాంకులకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
మాల్యాపై ఇండియాలోని పలు కోర్టుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు మాల్యాకున్న రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాజ్యసభ నైతిక విలువల కమిటీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. మే 3న జరిగే భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇప్పుడు విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో మాల్యా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. కాగా, మాల్యాకు చెందిన విలాసవంతమైన విమానాన్ని వేలం వేసేందుకు సర్వీస్ టాక్స్ శాఖ సిద్ధమమైంది.