పానీ ఔర్ కరెంట్ కట్.. 27 మంది మాజీ ఎంపీలకు షాక్..!
ఢిల్లీ : మాజీ ఎంపీలకు గట్టి షాక్ తగలనుంది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీలకు ఝలక్ ఇచ్చింది లోక్సభ ప్యానెల్. గడువు ముగిసినా ఇంకా ఆ బంగ్లాలను పట్టుకుని వేలాడుతున్న సదరు ఎంపీలకు తగిన బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. ఆ క్రమంలో ఆ ఎంపీల నివాసాలకు వాటర్, కరెంట్, గ్యాస్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది.
గడువు ముగిసినప్పటికీ అధికారిక నివాసాలు ఖాళీ చేయని మాజీ ఎంపీలకు లోక్సభ ప్యానెల్ గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని ల్యూటిన్స్ ప్రాంతంలోని అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయినా కూడా సదరు మాజీలు ఆ బంగ్లాలను వీడటం లేదు. దాంతో వారిని ఎలాగైనా ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్సభ ప్యానెల్ గట్టి నిర్ణయం తీసుకుంది.
ట్రాఫిక్ చలాన్లు రద్దు.. కండిషన్స్ అప్లై..!
అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీల నివాసాలకు నీరు, కరెంట్, గ్యాస్ సరఫరా నిలిపేయాలని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్సభ ప్యానెల్ ఆదేశాలు జారీచేసింది. దానికోసం పోలీసుల సహాయం కావాలని కోరింది. ఎంపీలు సాధారణంగా లోక్సభ రద్దయిన తర్వాత నెలలోపు బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది తమ పదవీకాలం ముగిసినా అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని పరిస్థితి కనిపిస్తోంది.
16వ లోక్సభ రద్దయిన తర్వాత ల్యూటిన్స్ ఢిల్లీలోని అధికారిక బంగ్లాల్లో 27 మంది మాజీ ఎంపీలు ఇంకా అక్కడే ఉండిపోయారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త ఎంపీలకు కొందరికి ఇంతవరకు బంగ్లాలు కేటాయించలేదు. మాజీ ఎంపీలు ఖాళీ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. దాంతో మాజీ ఎంపీలపై చర్యలు తీసుకుని.. వారిని ఖాళీ చేయిస్తే తప్ప కొత్త ఎంపీలకు బంగ్లాలు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే లోక్సభ ప్యానెల్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని వారిని ఖాళీ చేయించే పనిలో పడింది.