సినీ ప్రియులకు చేదువార్త.. మార్చి 2 నుంచి థియేటర్లు బంద్!
హైదరాబాద్ : సినీ ప్రియులకు ఇది చేదువార్తే. ఎందుకంటే, మార్చి 2 నుంచి సినిమా థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలితోపాటు దక్షిణాది నిర్మాతల సంఘం తీర్మానించింది.
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (డీఎస్పీలు) క్యూబ్, యూఎఫ్ఓ సంస్థల ప్రతినిధులతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ నిర్మాతల ఐకాస శుక్రవారం బెంగళూరులోని ఫిలిం ఛాంబర్లో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మార్చి 2 నుంచి దక్షిణాదిలో సినిమాల ప్రదర్శన నిలిపివేతకు నిర్మాతలు, పంపిణీదారులు నిర్ణయించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో...
మార్చి 2 నుంచి సినిమా థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలితోపాటు దక్షిణాది నిర్మాతల సంఘం తీర్మానించింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వేలాది సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా థియేటర్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 2 వేల థియేటర్లు మూత పడనున్నట్లు సమాచారం.
ఉన్నట్లుండి ఏమైంది?
దక్షిణాది సినిమా థియేటర్లలో ఓ ప్రాంతీయ సినిమా ప్రదర్శనకు ఒక్కో స్క్రీన్కు సుమారు రూ.22500 వరకు వీపీఎఫ్ను డీఎస్పీలు వసూలు చేస్తున్నాయి. ఇది నిర్మాతలకు భారంగా మారుతోంది. దీన్ని తగ్గించమని నిర్మాతల సంఘాలు కోరుతున్నాయి. శుక్రవారం బెంగళూరులోని ఫిలిం ఛాంబర్లో.. సినిమా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు.. క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలకు, నిర్మాతల సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వచ్చే నెల 2 నుంచి సినిమాలను ఈ సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వరకు థియేటర్లు మూతపడనున్నాయి.
ఎవరీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు?
ఒకప్పుడు థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు ఫిలిం రీలు అవసరమయ్యేది. ఈ పద్ధతిలో సినిమా మొత్తాన్ని పాజిటివ్ ప్రింట్ రూపంలోకి మార్చి ప్రదర్శిస్తుండే వారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఈ ప్రింట్ రీలు స్థానంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వచ్చారు. అంటే ఫిల్మ్ను ప్రింట్ల రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో థియేటర్లలో ప్రదర్శించడం. క్యూబ్, యుఎఫ్ఓ, పిఎక్స్డీ వంటి సర్వీసు ప్రొవైడర్లు ఇలా వచ్చిన వారే. ఈ డిజిటల్ రూపంలో ప్రదర్శించినందుకు సినిమాల నిర్మాతలు కొంత మొత్తాన్నిఈ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే వారు.
అసలేంటి ఈ వివాదం?
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు సినిమాల నిర్మాతలు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీలు కాలక్రమేణా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అంత మొత్తంలో చార్జీలను నిర్మాతలు చెల్లించలేక రేట్లను తగ్గించమని కోరారు. అయితే వారి విన్నపాన్ని సర్వీస్ ప్రొవైడర్లను పట్టించుకోలేదు. ఈ అంశంపైనే శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల నిర్మాతల మండలి క్యూబ్, యూఎఫ్ఓ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇరువర్గాల నడుమ చర్చలు విఫలం కావడంతో ఇక ఈ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు సినిమాలను ఇవ్వరాదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది.
రిలీజ్కు సిద్ధంగా ఉన్న సినిమాలు ఎలా?
దక్షిణాది రాష్ట్రాల నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఏ సినిమాలూ రిలీజ్ కాని పరిస్థితి నెలకొంది. వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్) విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సినిమాల ప్రదర్శనకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు తీసుకునే ఫీజును సగానికి తగ్గించాలనేది నిర్మాతల మండలి ప్రధాన డిమాండ్. కానీ వారి డిమాండ్కు డీఎస్పీలు తలొగ్గకపోవడంతో మార్చి 2 నుంచి దక్షిణాది సినిమాల ప్రదర్శన నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.