దిశ ఎన్కౌంటర్ కేసు సుప్రీం పరిధిలోకి.. మృతదేహాలపై నిర్ణయం కూడా: హైకోర్టు
దిశ నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. దీంతో కేసు తమ పరిధి దాటిపోయిందని చెప్పింది. తాము ఏర్పాటుచేసిన సిట్ విచారణను కూడా నిలిపివేయాలని ఆదేశించింనందున.. కేసు వివరాలను సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలని సూచించింది.
సుప్రీంకోర్టు తీర్పులో మృతదేహాల ప్రస్తావన లేదని బాధితుల తరఫు లాయర్లు హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశం కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తోందని హైకోర్టు ధర్మాసనం తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని సూచించింది. ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పు కాపీ, శుక్రవారం రోజు సుప్రీంకోర్టు తెలియజేసే అంశాల ఆధారంగా మధ్యాహ్నాం 2.30 గంటల తర్వాత తీర్పు తెలియజేస్తామని తెలిపింది.
హైకోర్టు ఆదేశాలతో మహబూబ్ నగర్ ఆస్పత్రి నుంచి నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శుక్రవారం వరకు ఇక్కడే ఉంచుతారు. కానీ సుప్రీంకోర్టు విచారణకు కమిటీ వేయడంతో మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలా ? లేదంటే భద్రపరచాలా అనే ప్రశ్న తలెత్తింది. ఆ బాధ్యతను అడ్వకేట్ జనరల్కు హైకోర్టు అప్పగించింది.
విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి.. విచారించాలని కోరింది. శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని.. మధ్యాహాం వరకు తమకు కాపీలు అందజేయాలని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.