దిశ ఎఫెక్ట్ : బస్సుల్లో సీసీ కెమెరాలు, పానిక్ బటన్లు..
దేశంలో దిశ సంఘటన పెను మార్పులను తెస్తోంది. ఆయా రాష్ట్రాల్లో మహిళల భద్రతకోసం పలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పోలీసుల నిఘాను పెంచడంతోపాటు మహిళల్లో అవగాహాన కార్యక్రమాలకు రాష్ట్రాలు శ్రీకారం చుట్టాయి. ఈనేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీలో మహిళల రక్షణ కోసం బస్సుల్లో సైతం నిఘా కెమెరాలను పెట్టాలని ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో సీసీ కెమెరాలతోపాటు అత్యవరసంలో వాడేందుకు పానిక్ బటన్స్ కూడ ఏర్పాటు చేయాని సర్కారు నిర్ణయించింది.
దేశ రాజధానిలో మహిళల భద్రత కోసం ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు బస్సులతోపాటు మెట్రోల్లో ఉచిత ప్రయాణం కల్పించి వారికి భరోసాతో పాటు భద్రతను కల్పించారు. ఈ నేపథ్యంలోనే మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో జరిగిన దిశ సంఘటనలు ఢిల్లీలో పునారావృతం కాకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వ రవాణా బస్సుల్లో సీసీ కెమెరాలు, పానిక్ బటన్స్, బస్సులకు జీపీఎస్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నారు.
కాగా ఢిల్లీలో ఉన్న మొత్తం 5500 బస్సుల్లో సీసీ కెమెరాలను అమర్చనున్నారు. ఇలా ఒక్కోబస్సుకు మూడు కెమెరాల చొప్పున అమర్చనున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. బస్సుల్లో ఏదైనా..ఇబ్బంది తలెత్తినప్పుడు పానిక్ బటన్స్ ప్రెస్ చేయడం ద్వారా పోలీస్ కమాండ్ సెంటర్కు సమాచారం వెళుతుందని..దీంతో పోలీసులు వెంటనే స్పందిస్తారని ఆయన తెలిపారు. ఇక బస్సుల కోసం ఎదురు చూడకుండా జీపీఎస్ సిస్టం పని చేస్తుందని తెలిపారు. అయితే ఈ మొత్తం ప్రాజెక్టు రానున్న ఆరు మాసాల్లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.