మళ్లీ వార్తల్లోకి దిశ ఎన్కౌంటర్: మృతుల కుటుంబాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం.. హత్య.. ఎన్కౌంటర్ ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. తమకు నష్ట పరిహారాన్ని చెల్లించడం, తెలంగాణ పోలీసులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని కోరుతూ ఎన్కౌంటర్ మృతుల కుటుంబీకులు దాఖలు చేసిన పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. వారికి ఎలాంటి పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
డిసెంబర్ 6న ఎన్కౌంటర్..
వెటర్నరీ డాక్టర్ దిశ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారానికి, దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితులుగా తేలిన మహ్మద్ ఆరిఫ్ భాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను
డాక్టర్ దిశ మృతదేహం లభించిన షాద్నగర్ సమీపంలోని ఛటాన్ పల్లి ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లగా.. వారు పోలీసులను గాయపరిచి, పారిపోవడానికి ప్రయత్నించారు. దీనితో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు మరణించారు.
తప్పు పట్టిన పౌరసంఘాలు, మానవ హక్కుల ప్రతినిధులు..
ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పౌరహక్కుల సంఘాలు ఈ ఎన్కౌంటర్ను తప్పు పట్టాయి. సైబరాబాద్ పోలీసుల తీరును తూర్పారబట్టాయి. నిందితులపై కాల్పులు జరిపిన పోలీసులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలంటూ డిమాండ్ చేశాయి. ఈ ఎన్కౌంటర్ సందర్భంగా కుటుంబ భారాన్ని మోసే వారిని కోల్పోయినందు వల్ల బాధితులకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించాలనీ పట్టుబట్టాయి.
పరిహారం, పోలీసులపై కేసు నమోదు కోసం సుప్రీంకోర్టులో పిల్..
పౌర హక్కులు, మావన హక్కుల సంఘాల తరఫున ప్రముఖ న్యాయవాదులు మణి, యాదవ్, ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నిందితులు జొల్లు నవీన్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రాజయ్య, చింతకుంట్ల చెన్నకేశవులు తండ్రి కూర్మన్న, మహ్మద్ ఆరిఫ్ భాషా తండ్రి పింజారి హుస్సేన్ తరఫున వారు ఈ పిల్ను వేశారు. ఈ పిల్ శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు సమక్షానికి వచ్చింది.
కొట్టేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదాలను ఆలకించిన తరువాత పిటీషన్ను కొట్టి వేస్తున్నట్లు బొబ్డె వెల్లడించారు. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్, తెలంగాణ హైకోర్టులో పిటీషన్ను దాఖలు చేయాలని సూచించింది ధర్మాసనం.
కమిషన్ను ఆశ్రయించాలంటూ సూచన..
పిటీషన్దారు తొలుత తన వద్ద ఉన్న సాక్ష్యాలన్నింటినీ కమిషన్కు అందజేయాలని పేర్కొంది. అనంతరం- నష్ట పరిహారం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే వెసలుబాటును బాధిత కుటుంబాలకు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలా? వద్దా? అనే విషయాన్ని కూడా తాము ఏర్పాటు చేసిన కమిషనే నిర్ధారిస్తుందని పేర్కొంది. ఆరు నెలల వ్యవధిలో ఈ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయాల్సి ఉంది.