మతాంతర వివాహం చేసుకునే జంటలకు ఊరట... అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. ఇకపై అది ఆప్షనల్..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతేడాది నవంబర్లో తీసుకొచ్చిన యాంటీ లవ్ జిహాదీ చట్టంతో ఎన్నో జంటలు వేధింపులకు గురవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లికి ముందు మతం మారాలనుకుంటే జిల్లా మెజిస్ట్రేట్ అధికారి నుంచి అనుమతి పొందడాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకోసం మెజిస్ట్రేట్ అధికారికి లిఖితపూర్వక నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటీసులను మెజిస్ట్రేట్ కార్యాలయంలో 30 రోజుల పాటు డిస్ప్లేలో ఉంచుతారు. అయితే ఈ చర్య పెళ్లి చేసుకోవాలనుకునే జంటల ప్రైవసీకి,స్వేచ్చకు భంగం కలిగిస్తోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఊరట కలిగించేదిగా ఉంది.
కోర్టు తీర్పు...
మతాంతర వివాహం కోసం ఇతర మతంలోకి మారాలనుకునే జంటలు జిల్లా మెజిస్ట్రేట్కు ఇచ్చే నోటీసులను ఇకపై డిస్ప్లేలో ఉంచాల్సిన అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు ఆ జంటల స్వేచ్చ,గోప్యత,ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని కోర్టు పేర్కొంది. రాజ్యం జోక్యం లేకుండా వివాహం చేసుకోవాలనే వ్యక్తుల స్వేచ్చకు ఇది భంగం కలిగిస్తుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ వివేక్ చౌదరి నేత్రుత్వంలోని బెంచ్ 47 పేజీల తీర్పును వెలువరించింది.
వారికే ఆప్షన్ ఇచ్చిన కోర్టు...
ఇకపై ఆ నోటీసులను మెజిస్ట్రేట్ కార్యాలయంలో డిస్ప్లేలో చేయాలా లేదా అన్నది ఆ జంటలే నిర్ణయించుకునేలా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆ జంటలు ఇచ్చే లిఖితపూర్వక విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని మెజిస్ట్రేట్ అధికారులకు సూచించింది. నోటీసుల డిస్ప్లేకి వారు ఓకె అంటే వాటిని డిస్ప్లే చేయడం లేదంటే డిస్ప్లే చేయకుండా ఉండాలని తెలిపింది. అంటే,ఈ విషయంలో ఆప్షన్స్ను జంటలకే వదిలిపెట్టింది. ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఆ పిటిషన్పై విచారణ సందర్భంగా
సదరు ముస్లిం మహిళ ఇటీవల ఓ హిందూ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇందుకోసం ఆమె ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి మారింది. అయితే ఆమె నిర్ణయాన్ని తండ్రి వ్యతిరేకిస్తున్నాడు. ఆమెను భర్తతో కలిసి ఉండేందుకు అనుమతించట్లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ 2020 ద్వారా మతం మారేందుకు వారు మెజిస్ట్రేట్కు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. ఈ నోటీసును 30 రోజుల పాటు మెజిస్ట్రేట్ కార్యాలయంలో డిస్ప్లేలో ఉంచుతారు. అయితే ఈ నోటీసులను ఇలా బహిర్గతపరచడం వల్ల తమపై అనవసరంగా సామాజికపరమైన ఒత్తిడి,ఇతరుల జోక్యం పెరుగుతుందని... స్వేచ్చగా వివాహం చేసుకునే హక్కును కోల్పోతామని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఇకపై నోటీసులను డిస్ప్లే చేయడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.