మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయనున్న దినకరన్ వర్గం
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఊపందుకుంది. 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హతవేటును మద్రాసు హైకోర్టు సమర్థించడంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరనుంది. ఇక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది దినకరన్ వర్గం.
టీటీవీ దినకరన్ మద్దతుదారుడు అన్నాడీఎంకే అనర్హత ఎమ్మెల్యే తంగ తమిల్సెల్వన్ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచన అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పు సవాల్ చేయడం అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేశారని సెల్వన్ చెప్పారు. దినకరన్తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ తమపై అన్యాయంగా అనర్హత వేటు వేసి తప్పు చేశారని సెల్వన్ చెప్పారు.
ఇదిలా ఉంటే స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది మద్రాసు హైకోర్టు . ఈ తీర్పుతో పళనిస్వామి ప్రభుత్వానికి ఊరట లభించినట్లయ్యింది. 18 మంది ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్,శశికళ వర్గానికి చెందిన వారు. ఇక మొదటినుంచి పళని సర్కార్ను పడగొట్టాలని ప్రయత్నిస్తున్న దినకరన్కు కోర్టు తీర్పు గట్టి షాక్ అనే చెప్పాలి. తన వర్గం ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోనే ఉంటూ బలపరీక్షలో పళని స్వామికి వ్యతిరేకంగా ఓటు వేసి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనతో ఉన్న వీరికి హైకోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే ఎన్నికలకు వెళ్లడం తన వ్యక్తిగత అభిప్రాయమని దినకరన్ చెప్పారు.