టీటీవీ దినకరన్ ను నమ్మి నట్టేట మునిగిపోయాం, ఆయన దర్జాగా అసెంబ్లీలో, పదవులు!
చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారని స్ఫష్టంగా వెలుగు చూసింది. టీటీవీ దినకరన్ ను నమ్ముకుని నట్టేట మునిగిపోయామని, ఇప్పుడు మా పదవులు, నిధులకు ఎసరు వచ్చిందని, ఒక్కపని జరగడం లేదని రెబల్ ఎమ్మెల్యేలు వాపోతున్నారని తెలిసింది.
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం
తమిళనాడులోని ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం రండి అంటు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చిన టీటీవీ దినకరన్ మొదట 28 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నారు. 28 మంది ఎమ్మెల్యేలను చెన్నైలోని ఇంటికి పిలిపించుకున్న టీటీవీ దినకరన్ వారికి మాయమాటలు చెప్పారు.
రిసార్టు రాజకీయం
ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం పాచికతో టీటీవీ దినకరన్ గ్రూపులో ఉన్న 7 మంది ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేశారు. ఇలాగే ఉంటే అందరూ వెళ్లిపోతారని భావించిన టీటీవీ దినకరన్ 21 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్టుకు తరలించి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నించాడు.
రిసార్టు నుంచి పరార్
పుదుచ్చేరిలోని రిసార్టులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ కు సినిమా చూపించి రాత్రికి రాత్రే అక్కడి నుంచి పరారై ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం గూటికి చేరారు. షాక్ కు గురైన టీటీవీ దినకరన్ మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలను కర్ణాకటలోని కొడుగు రిసార్టుకు తరలించారు.
నిధులు నిలిపేశారు
టీటీవీ దినకరన్ గ్రూప్ లో ఉన్న 18 మంది రెబల్ ఎమ్మెల్యేల మీద స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు. ఈ వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. అనర్హతకు గురైన 18 మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు ప్రభుత్వం నిధులు నిలిపివెయ్యడంతో రెబల్ నాయకులు షాక్ కు గురైనారు.
దర్జాగా అసెంబ్లీకి
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్ దర్జాగా అసెంబ్లీకి వెలుతున్నారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వరకూ టీటీవీ దినకరన్ వెంట వెళ్లి ముందులాగా లోపలికి వెళ్లలేక దీనంగా వెనక్కి తిరిగి వస్తున్నారు.
Recommended Video
టీటీవీ దినకరన్ నిర్లక్షం !
గతంలో దర్జాగా అసెంబ్లీలోకి అడుగు పెట్టే వాళ్లమని, టీటీవీ దినకరన్ ను నమ్ముకుని ఇప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి వచ్చిందని, ఆయన మాత్రం ఆయన దారి చూసుకుంటున్నారని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు బుధవారం వారి సన్నిహితుల వద్ద ఆవేదన చెందానని వెలుగు చూసింది.