బీజేపీలోకి అనర్హత ఎమ్మెల్యేలు : ధృవీకరించిన డిప్యూటీ సీఎం అశ్వత్నారాయణ్
న్యూఢిల్లీ: అనర్హతకు గురైన 17 మంది కాంగ్రెస్ జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కొన్ని గంటల్లోనే వారంతా బీజేపీలో నవంబర్ 14న చేరతారని చెప్పారు కర్నాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం అశ్వత్నారాయణ్. వారు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపారని, ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ లీడర్లను వారు కలిశారని ఆయన చెప్పారు. పార్టీ సీనియర్ నాయకులు కూడా వారిని స్వాగతించారని అశ్వత్ నారాయణ్ చెప్పారు.
కర్నాటర రెబెల్ ఎమ్మెల్యేలపై నిర్ణయం బుధవారంలోగా తీసుకుంటాం: సుప్రీం కోర్టుతో స్పీకర్
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కర్నాటక డిప్యూటీ సీఎం అశ్వత్నారాయణ్.... రేపు సీఎం యడ్యూరప్ప , బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ సమక్షంలో ఉదయం 10:30 గంటలకు బెంగళూరులో పార్టీలో చేరతారని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అనర్హత వేటు పట్ట ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎం అశ్వత్నారాయణన్ బీజేపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ను కలిశారు.
అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు డిసెంబర్ 5న జరగనున్న కర్నాటక ఉపఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు. ఇందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. కర్నాటక సంక్షోభం సందర్భంగా 17 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అప్పటి స్పీకర్ కేఆర్ రమేష్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల డిసెంబర్ 5న జరగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేయొచ్చని పేర్కొంది. 2023లో కర్నాటక 15వ అసెంబ్లీ ముగిసే వరకు వారిపై అనర్హత వేటు ఉంటుందని అప్పటి స్పీకర్ తీసుకున్న నిర్ణయంను సుప్రీంకోర్టు కొట్టివేసింది.