ఆ టీవీ ఛానెల్తో దేశానికి హాని - ‘యూపీఎస్సీ జీహాద్’ షోపై నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు
''మీడియా స్వేచ్ఛ పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదు. మీడియాకున్న స్వేచ్ఛ సంపూర్ణమైనదేమీకాదు. దేశంలో సివిల్ సర్వీసులకు సంబంధించిన అత్యున్నత సంస్థ యూపీఎస్సీ ప్రతిష్ట దెబ్బతినేలా సదరు మీడియా సంస్థ వ్యవహరించడం ఖండనీయం. పనిగట్టుకొని కృత్రిమంగా వడ్డించే ఇలాంటి కథనాలు దేశానికి హానికరం'' అంటూ వివాదాస్పద సుదర్శన్ టీవీపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది.
చైనా టెంపర్: కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరింపు - 'చుశూల్’ స్ట్రాటజీతో భారత్
నోయిడా కేంద్రంగా పనిచేసే హిందీ న్యూస్ ఛానెల్ 'సుదర్శన్ టీవీ' తొలి నుంచీ యాంటీ ముస్లిం కథనాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఛానెల్ లో ప్రసారమైన 'యూపీఎస్సీ జీహాద్' కార్యక్రమం విద్వేషపూరితంగా ఉందని, దాని ప్రసారాలను వెంటనే నిలిపేసేలా ఆదేశాలివ్వాలంటూ అమితాబ్ పాండే, నవ్ రేఖా శర్మ అనే మాజీ ఐఏఎస్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా సుదర్శన్ టీవీ సహా మీడియా సంస్థల తీరుపై జడ్జిలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో సివిల్ సర్వీసుల్లోకి చొరబడుతున్నారని, దేశాన్ని కబళించాలనే ఉద్దేశంతోనే వాళ్లుదీన్నొక జీహాద్ లాగా పరిగణిస్తున్నారంటూ 'యూపీఎస్సీ జీహాద్' పేరుతో సుదర్శన్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. గత ఆగస్టులోనే ఈ కార్యక్రమాన్ని నిషేధించాలనే డిమాండ్ వ్యక్తమైనా.. అందుకు కోర్టు నిరాకరించింది. తీరా 'యూపీఎస్సీ జీహాద్' ఎపిసోడ్లు ప్రసారం అయిన తర్వాతగానీ అత్యున్నత స్థానం దానిని తప్పుపట్టింది.
''యూపీఎస్సీ జీహాద్' పేరిట ప్రసారమైన కథనాలు రాజ్యాంగ విరుద్దంగా లేవని, అవసరమైతే సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని సుదర్శన్ టీవీ తరఫు లాయర్ వాదించగా.. ''యూపీఎస్సీ పరీక్షలో అభ్యర్థులందరూ ఒకే పరీక్ష రాస్తారు.. ఇంటర్వ్యూలు కూడా ఒకేలా ఉంటాయి.. కానీ ఒక వర్గం మాత్రమే యూపీఎస్సీలోకి చొరబడుతోందని మీరు(సుదర్శన్ టీవీ) చెబుతున్న విషయాలు సత్యదూరమైనవి. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమైనవి కూడా. తద్వారా మీరు(సుదర్శన్ టీవీ) దేశానికి హాని తలపెడుతున్నారు'' అంటూ జస్టిస్ చంద్రచూడ్ మండిపడ్డారు. ఈ వివాదానికి సంబంధించి కేంద్రం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్, సుదర్శన్ టీవీలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.
చైనా టెంపర్: కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరింపు - 'చుశూల్’ స్ట్రాటజీతో భారత్
సుదర్శన్ టీవీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించిన బెంచ్ లో మరో జడ్జి ఎంకే జోసెఫ్.. మొత్తం మీడియా సంస్థల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. టీవీ ఛానెళ్లలో డిబేట్లు జరుగుతోన్న తీరును ఆయన తప్పుపట్టారు. ''చర్చ సరైన దిశలో సాగకుండా.. యాంకర్ గట్టి గట్టిగా అరుస్తూ.. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్యానలిస్టుల నోరుమూయించడం సరికాదు. దీన్ని మీడియా స్వేచ్ఛ అనుకోవడం ముమ్మాటికీ పొరపాటే'' అని అన్నారు. మీడియా సంస్థలపై నియంత్రణ కష్టతరమే అయినప్పటికీ.. అవి తమ స్వేచ్ఛను బాధ్యతగా వాడుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు.