ఐఏఎస్ రవి మృతి: స్వీట్స్ పంచిపెట్టిన ఎంఎల్ఏలు ?
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద స్థితిలో మరణించారని తెలుసుకున్న ఇద్దరు శాసన సభ్యులు స్వీట్స్ పంచిపెట్టి పండుగ చేసుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. డి.కే. రవి కోలారు జిల్లా కలెక్టర్ గా పని చేసే సమయంలో ఆ ఇద్దరు శాసన సభ్యుల అక్రమాలను అడ్డుకున్నారని, అందు వలనే వీరిద్దరి అనుచరులు పండుగ చేసుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబీత్ పాత్రో, అమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చడ్డా, టైమ్స్ చానెల్స్ కు చెందిన అర్నబ్ గోస్వామి, కర్ణాటక ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ తదితరులు చర్చాగోష్టిలో పాల్గొన్నారు.
ఇద్దరు శాసన సభ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గత సోమవారం 16వ తేదీన బెంగళూరు నగరంలోని కోరమంగలలోని అపార్ట్ మెంట్ లో ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానస్పద స్థితిలో మరణించారు.
ఈ విషయం మీడియాలో రావడంతో కోలారు శాసన సభ్యుడు, మాజీ మంత్రి (స్వతంత్ర అభ్యర్థి, కాంగ్రెస్ కు మద్దతుదారుడు) వర్తూరు ప్రకాష్, బంగారుపేట కాంగ్రెస్ శాసన సభ్యుడు నారాయణ స్వామి తన అనుచరులకు స్వీట్స్ పంచిపెట్టారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
సోమవారం ఒక ఇంగ్లీష్ చానెల్ న్యూస్ అవర్ లో చర్చాగోష్టి ఎర్పాటు చేశారు. ఆ సందర్బంలో బీజేపీ నాయకులు రాష్ట్ర మంత్రి దినేష్ గుండూరావ్ కు ఇవే ప్రశ్నలు వేశారు. ఐఏఎస్ అధికారి రవి మరణించిన తరువాత మీ పార్టికి చెందిన శాసన సభ్యుడు నారాయణ స్వామి, మీకు బయట నుండి మద్దతు ఇస్తున్న ఎంఎల్ఏ వర్తూరు ప్రకాష్ స్వీట్లు పంచిపెట్టిన విషయం మీకు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. తనకు ఆ విషయం తెలియదని దినేష్ గుండూరావ్ చిన్నగా తప్పించుకున్నారు.
కోలారులోని వర్తూరు ప్రకాష్ ఇంటి మీద, బంగారుపేటలో స్థానిక శాసన సభ్యుడు నారాయణ స్వామి ఇంటి మీద కొందరు రాళ్లు రువ్వి నిరసన వ్యక్తం చేశారు. ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి రవి మీద వీరిద్దరు దురుసుగా ప్రవర్థించారని, అధికారులను బెదిరించారని స్థానికులు మండిపడుతున్నారు.