ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్కు క్లీన్చిట్, ఆరోపణలను కొట్టేసిన బాంబే హైకోర్టు బెంచ్
ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్కు ఇరిగేషన్ కుంభకోణం కేసులో భారీ ఊరట లభించింది. మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది. నాగ్పూర్, అమరావతి ఏసీబీ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా విదర్భ ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్ల అనుమతికి సంబంధించి జరిగిన అవినీతిలో అజిత్ పవార్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ కొట్టివేసింది.
Disha case encounter: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే కీలక వ్యాఖ్యలు
ఏసీబీ దర్యాప్తు..
ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ను మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రోజు ముందే నవంబర్ 27న ఏసీబీ కోర్టుకు సమర్పించింది. కాగా, 2012లో బాంబే హైకోర్టులోని నాగ్పూర్ బెంచ్ ముందు రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటి ఆధారంగా విదర్భ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్(వీఐడీసీ)లో 45 ప్రాజెక్టుల్లో 2,654 టెండర్లకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేసింది.
అజిత్ పవార్కు సంబంధం లేదంటూ..
నవంబర్ 25న ఏసీబీ అవినీతి ఆరోపణలున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి తొమ్మిది కేసుల్లో విచారణ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, వాటితో అజిత్ పవార్కు సంబంధం లేదని స్పష్టం చేసింది. దర్యాప్తులో ఎవరికి వ్యతిరేకంగా నేరం చేసినట్లు ఆధారాలు లభించనందున విచారణ ఆపేస్తున్నామని, అయితే, ఈ 9 కేసులతో అజిత్ పవార్, ఒకప్పటి వీఐడీసీ ఛైర్మన్కు ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ పేర్కొంది.
అజిత్ నిందితుడిగా లేరు..
తాజాగా ప్రభుత్వ అభిప్రాయం మేరకు అజిత్ పవార్కు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించినట్లు ఏసీబీ తెలిపింది. తాము దర్యాప్తు చేస్తున్న ఏ కేసులోనూ అజిత్ పవార్ నిందితుడిగా లేరని తేల్చి చెప్పింది. అయితే, విదర్భ నీటిపారుదలకు టెండర్లకు సంబంధించి అన్ని కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుందిన ఏసీబీ వివరించింది.
వేలకోట్ల స్కాం..
1999-2009 మధ్య కాలంలో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంలో అజిత్ పవార్ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన విదర్భ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా కూడా పనిచేశారు. ఆ సమయంలో విదర్భ ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టులు, టెండర్ల అనుమతులకు సంబంధించి రూ. 7వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలతో అజిత్ పవార్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా, ఈ ప్రాజెక్టుల్లో రూ. 70వేల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. జలవనరుల శాఖ తాజా(10.9.2018, 11.6.2019)గా విడుదల చేసిన లేఖలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది.