కొత్త కోడళ్లకు కన్యత్వ పరీక్ష... ఆ రాత్రి అలా జరగలేదని విడాకులు... మహారాష్ట్రలో దారుణం...
కన్యత్యం.. కన్నె పొర... ఇప్పటికీ సమాజంలో వీటి చుట్టూ ఎన్నో అపోహలు కమ్ముకుని ఉన్నాయి. సాధారణంగా స్త్రీ యోనిలో ఉండే హైమన్ పొరనే కన్నె పొర అని అంటారు. తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ పొర చిరిగిపోయి రక్తం వస్తుంది. అయితే క్రీడలు ఆడేవారు,సైకిల్ తొక్కేవారు,జిమ్నాస్టిక్స్,డ్యాన్స్,చెట్లు ఎక్కడం.. ఇలాంటి చర్యల ద్వారా హైమన్ పొర చిరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటివారికి తొలిరాత్రి కలయికలో రక్తం రాకపోవచ్చు.
అంతమాత్రాన వారిని అనుమానించాల్సిన పని లేదు. అయితే ఇప్పటికీ దీని పట్ల సరైన అవగాహన లేని వ్యక్తులు కేవలం ఆ రాత్రి అలా జరగలేదన్న కారణంగా నవ వధువులను అవమానించడం,విడాకులు తీసుకోవడం ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది.
అసలేం జరిగింది...
మహారాష్ట్రలోని కంజర్భట్ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు గతేడాది నవంబర్లో పెళ్లిళ్లు జరిగాయి. ఈ ఇద్దరూ కర్ణాటకలోని బెల్గాంకి చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లను పెళ్లి చేసుకున్నారు.వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లి జరిగిన ఐదో రోజు అత్తగారింట్లో వీరికి శోభనం ఏర్పాటు చేశారు. ఇద్దరిని చెరో గదిలోకి పంపించారు. అప్పటికే ఆ గదిలో పడక మంచంపై తెల్లటి వస్త్రం పరిచి ఉంచారు. అంటే,ఆ రాత్రి కలయికలో ఆ తెల్లటి వస్త్రంపై రక్తం మరకలు అంటితే కోడలు పిల్లను కన్యగా నిర్దారిస్తారు.
శోభనం గదిలో...
ఆ రాత్రి రెండు జంటలకు వేర్వేరు గదుల్లో శోభనం జరిగింది. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరికి తొలిరాత్రి కలయికలో రక్తం వచ్చింది. మరొకరికి మాత్రం అలా జరగలేదు. దీంతో ఆమెను ఆ కుటుంబం అనుమానించింది. పెళ్లికి ముందే నీకు మరొకరితో సంబంధం ఉందని నిందించింది. తాను అలాంటి దానిని కాదని ఆమె ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. పైగా ఆమె సోదరిని కూడా అవమానించారు. ఇద్దరినీ వేధింపులకు గురిచేసి పుట్టింటికి తరిమేశారు.
పెద్ద మనుషుల పంచాయతీ... విడాకులు...
ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు కుటుంబాల పెద్దలు పెద్ద మనుషుల సమక్షంలో ఓ దేవాలయం వద్ద పంచాయతీ నిర్వహించారు. అక్కడి పెద్ద మనుషులు కూడా ఆ ఇద్దరు అమ్మాయిలనే తప్పు పట్టారు. ఆ ఇద్దరి నుంచి వారి భర్తలకు విడాకులు ఇప్పించారు. తమకు జరిగిన అన్యాయంపై ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మహారాష్ట్రలోని ఓ ఎన్జీవోని ఆశ్రయించారు. ఆపై వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిందంతా పోలీసులకు వివరించారు. అంతేకాదు,ఒకవేళ తమను తిరిగి తీసుకెళ్లాలంటే రూ.10లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రేప్ కేసు నమోదు చేయాలని డిమాండ్...
ఆ ఎన్జీవో సంస్థ సభ్యురాలు సుజాత మాట్లాడుతూ... 'నిజానికి ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు శారీరకంగా దోపిడీకి గురయ్యారు. వారిని పెళ్లి చేసుకుని... శోభనం కూడా జరిగాక... కన్యత్వం పేరుతో వారికి విడాకులు ఇవ్వడం దారుణం. కాబట్టి వారిపై రేప్ కేసు నమోదు చేయాలి. అలాగే ఆ అమ్మాయిలనే తప్పు పట్టిన ఆ పంచాయతీ పెద్దలను కూడా శిక్షించాలి.' అని డిమాండ్ చేశారు. నిజానికి ఇప్పటికీ పలు కమ్యూనిటీల్లో ఇలా వైట్ షీట్ టెస్టు పేరుతో మహిళల కన్యత్వాన్ని పరీక్షించి వారిని అవమానాలకు గురిచేస్తున్నారు.