సోషల్ మీడియా ఇంచార్జ్గా రాజీనామా: గురువారం వెళ్తున్నా... రమ్య ఏం చెప్పారంటే?
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ ఇంచార్జ్ పదవికి దివ్య స్పందన (రమ్య) బుధవారం రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన లేకపోడంతో కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడింది. కానీ ఈ ఊహాగానాలకు ఆమె తెరదించారు.
తాను రాజీనామా చేస్తున్నానంటూ వచ్చినవి అన్నీ పుకార్లేనని చెప్పారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టి పారేశారు. తాను ప్రస్తుతం సెలవులో ఉన్నానని, గురువారం కార్యాలయానికి వెళ్తానని చెప్పారు.
రాఫెల్ ఒప్పందం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ దొంగ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఓ ఫొటోను కూడా దానికి జతచేశారు. దీంతో యూపీలోని లక్నోకు చెందిన సయ్యద్ రిజ్వాన్ అనే న్యాయవాది ఆమెపై ఫిర్యాదు చేశారు.
ఆమె ట్వీట్ దేశ ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా, దేశ ధిక్కారం కిందకు వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా చేశారనే ప్రచారం సాగింది. ట్విట్టర్ ప్రొఫైల్లో చోటు చేసుకున్న మార్పు కారణంగా ఆమె రాజీనామా ప్రచారం సాగింది. అయితే బగ్ (సాంకేతిక లోపం) కారణంగా ఈ లోపం తలెత్తిందని ఆమె తెలిపారు.