ఢిల్లీలో దారుణ కాలుష్య పరిస్ధితులు- ఈ రాత్రికి మరింత విషమించే ప్రమాదం- సర్వత్రా ఆందోళన
దేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటైన రాజధాని ఢిల్లీలో పరిస్ధితులు నానాటికీ విషమిస్తున్నాయి. ఇప్పటికే వాయుకాలుష్యంతో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతూ ఉండగా.. ఇవాళ దీపావళి వేడుకల సందర్భంగా పరిస్ధితి మరింత తీవ్రంగా మారే ప్రమాదముందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కంటే ముందే తీవ్ర వాయు కాలుష్యం ఉండగా.. లాక్డౌన్ సందర్భంగా ఇది కాస్త తగ్గింది. తిరిగి లాక్డౌన్ సడలింపులతో పరిస్ధితి దారుణంగా మారింది. చివరికి వాయు కాలుష్యం కారణంగా కరోనా వైరస్ కూడా దారుణంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఢిల్లీలో ప్రతీ ఇంట్లోనూ కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రతీ నలుగురిలో ఒకరికి కరోనా సోకినట్లు హైకోర్టు కూడా నిర్ధారించింది. ఇలాంటి పరిస్ధితుల్లో లాక్డౌన్ సడలింపులు అవసరమా అని కేజ్రివాల్ ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించింది.
ఇవాళ ఉదయం 9 గంటల సమయానికి ఢిల్లీలో వాయుకాలుష్య సూచీ 369 పాయింట్లుగా నమోదైంది. శుక్రవారం నమోదైన 24 గంటల సగటు చూసినా ఇది 339గా ఉంది. గురువారం సూచీ 314గా నమోదైంది. ఇవాళ దీపావళి వేడుకల సందర్భంగా ఇది మరింత ప్రమాద కర స్ధాయికి చేరవచ్చనే అంచనాలను కేంద్ర భూగర్భమంత్రిత్వశాఖ వెలువరించింది. దట్టమైన పొగతో పాటు టపాసులు పేల్చడం ద్వారా వెలువడే కాలుష్యంతో రేపు ఉదయం కల్లా పరిస్ధితి తీవ్రంగా మారొచ్చని కేంద్రం చెబుతోంది.
ఢిల్లీలో ప్రస్తుతం తీవ్ర చలి గాలులు వీస్తున్నాయి. వీటి వల్ల కాలుష్యం వివిధ ప్రాంతాలకు పాకే ప్రమాదం కూడా నెలకొంది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గుర్గావ్లోనూ దాదాపు ఇవే పరిస్ధితులు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం దీపావళి రోజు వాయి కాలుష్య సూచీ 281గా నమోదు కాగా.. ఇవాళ ఉదయానికే 369 పాయింట్లకు చేరడం పరిస్ధితి తీవ్రతను సూచిస్తోంది.