ప్రమిదల దీపావళి.. పర్యావరణ హిత దీపావళి .. లక్ష్మీ కటాక్షం అప్పుడే
దీపావళి... చీకట్లను పారద్రోలే వెలుగు ఉత్సవం. అందరి జీవితాల్లో సంతోషం నింపే సంబరం . పేద , ధనిక, చిన్న ,పెద్ద తేడా లేకుండా, కులాలకు అతీతంగా జరుపుకునే ఆనందాల వేడుక దీపావళి . దీపావళి అంటే మన ఇంటి ముందు వెలుగులు నింపటమే కాదు అందరి జీవితాలు వెలుగుతూ ఉండాలని కోరుకోవటం, అంతా ఆనందోత్సాహాలతో వేడుక చేసుకోవటం.
ధ్వని,పర్యావరణ కాలుష్యం లేని దీపావళి
అలా జరగాలంటే అన్నిటికంటే మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. పర్యావరణానికి హాని కలిగించే పనులు చెయ్యకుండా పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలి . ఇక అన్నిటికంటే దీపావళి ప్రత్యేకం అయిన దీపాల విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మట్టి ప్రమిదలతో సాంప్రదాయబద్దంగా సంబరం జరుపుకోవాలి. ప్రకృతికి విఘాతం కలిగించని, ధ్వని,పర్యావరణ కాలుష్యం లేని దీపావళి జరుపుకోవాలి. అందుకోసం ఏం చెయ్యాలంటే మట్టి ప్రమిదలలో నూనె పోసి, నువ్వుల నూనె , కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నెయ్యి ఇలా ఏదైనా నూనె పోసి దీపాలు వెలిగించండి. దీప కాంతులతో ఇంటిని అలంకరించండి.
ఎలక్ట్రిక్ దీపాల వెలుగులకు, ఆర్టిఫీషియల్ ప్లాస్టిక్ దీపాలకు నో
ఎలక్ట్రిక్ బల్బులు , ఎల్ ఈడీ బల్బులకు, డెకరేషన్ బల్బులకు బదులుగా దీపాలను పెట్టండి.ఇప్పుడు మార్కెట్ లో ప్లాస్టిక్ , అల్యూమినియం వంటి మెటీరియల్ తో రకరకాల దీపాలు అందుబాటులో ఉంటున్నాయి.ఎలక్ట్రిక్ దీపాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. కానీ వాటిని వినియోగించకండి. పర్యావరణానికి హాని కలిగించే వస్తువులు ఏవైనా పండుగ నాడు వినియోగించవద్దు .కాబట్టి ఇంట్లో దీపాలు పెట్టేందుకు మట్టి ప్రమిదల్నే ఉపయోగించండి.
ఇంట్లో ఉన్న పిండి,పండ్లతోనే దీపాల తయారీ మేలు
ఇంకా గోధుమ పిండి ప్రమిదలు, కొబ్బరి చిప్పలు, నిమ్మ,బత్తాయి,నారింజ తొక్కలతో ప్రమిదలు,సముద్రపు గవ్వలతోపాటు ఇలా పర్యావరణానికి హాని కలిగించని దీపాలు వెలిగించొచ్చు. వీటివల్ల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. చూసే వారికి కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పర్యావరణానికీ మేలు కలుగుతుంది. హిందూ ధర్మం ప్రకారం ఇంట్లో దీప కాంతులు వెదజల్లుతుంటే ఇంట్లోకి ఎలాంటి చెడుశక్తులు ప్రవేశించవని నమ్మకం. సాక్షాత్తు ఆ లక్ష్మీ దేవి ఇంటికి వస్తుందని విశ్వాసం.
మట్టి ప్రమిదలే సర్వదా శ్రేయం ..అదనపు విద్యుత్ వినియోగానికి చెక్
ఆ వెలుగులు, ఆ నమ్మకాలు స్వచ్ఛంగా ఉండాలంటే నూనెతో వెలిగించే ప్రమిదలనే ఇంట్లో అలంకరణకు పెట్టండి. దీపావళి వచ్చిందంటే చాలు విపరీతంగా పెరిగిపోయే విద్యుత్ వినియోగానికి దీపాలతో చెక్ పెట్టండి. ఇళ్లు, వ్యాపార కార్యాలయాలను విద్యుత్ దీపాలతో పెద్ద ఎత్తున అలంకరించే వారు వాటికి బదులు ప్రమిదల్లో నూనె దీపాలు వెలిగించి,అలంకరణ చేస్తే అందమే కాదు ఆనందం కూడా. ఇక ఇలా మట్టి ప్రమిదలలో దీపాలు వాడటం శ్రేయస్కరం. అంతేనా కుమ్మరి వృత్తి చేసే వారికి కాస్త ఆసరా అందించినట్టు కూడా అవుతుంది. వీటివల్ల ఖర్చు తగ్గడంతోపాటు పర్యావరణానికీ మేలు కలుగుతుంది. సీజన్ లో వచ్చే కీటకాలనుండి రక్షించే నూనె దీపాల వెలుగు పూలతో అమావాస్య రోజున వెన్నెల వెలుగుల్ని ఆస్వాదించండి .