ఐఏఎస్ డికే. రవి: నెట్లో క్లిప్పింగ్స్, పోలీసుపై వేటు
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికే రవి అనుమానాస్పద మృతి కేసు విచారణ జరిగే సమయంలో ఒక పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని ఆరోపిస్తూ అతనిని సస్పెండ్ చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. రేణుకేష్ అనే కానిస్టేబుల్ ను సస్పెండ్ చెయ్యాలని డీసీపీ డాక్టర్ రోహిణి నివేదిక తయారు చేసి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డికి పంపించారని తెలిసింది.
వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి డికే. రవి కోరమంగల సమీపంలోని సెయింట్ జాన్ వుడ్ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో నివాసం ఉండే వారు. గత నెల 16వ తేదిన డికే రవి ఆయన నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ రేణుకేష్ డికే రవి అపార్ట్ మెంట్ చేరుకున్నాడు. తరువాత డికే రవి ఆరంజ్ రంగు వేల్ తో ఫ్యాన్ కు వేలాడుతున్న విషయం గుర్తించాడు. వెంటనే జోబులో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకుని రవి ఫ్యాన్ కు వేలాడుతున్న దృశ్యాలు చిత్రీకరించాడు.
అదే సమయంలో అక్కడకు చేరుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డికే. రవి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తరువాత కానిస్టేబుల్ రేణుకేష్ డికే. రవి ఫ్యాన్ కు వేలాడుతున్న దృశ్యాలను తీసుకు వెళ్లి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు.
ఐఏఎస్ అధికారి డికే. రవి ఆత్మహత్య చేసుకున్నాడని ఎం.ఎన్. రెడ్డి చెప్పడం, తరువాత ఇంటర్నెట్ లో ఆ చిత్రాలు హల్ చల్ చెయ్యడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, అనుమానాస్పద స్థితిలో మరణించినా సంఘటనా స్థలంలోని దృశ్యాలను చిత్రీకరించరాదు.
వేలిముద్రల నిపుణులు, ఫోరెన్సిక్ నిపునులు మాత్రమే అక్కడి దృశ్యాలను చిత్రీకరించడానికి అనుమతి ఉంటుంది. అయితే కానిస్టేబుల్ రేణుకేష్ డికే. రవి ఫ్యాన్ కు వేలాడుతున్న దృశ్యాలను చిత్రీకరించడమే కాకుండా ఆ క్లిప్పింగ్స్ తీసుకు వెళ్లి ఇంటర్నెట్ లో పెట్టారని పై అధికారులు గుర్తించారు.
నియమాలు ఉల్లంఘించి మొబైల్ లో అక్కడి దృశ్యాలను చిత్రీకరించాడని, దర్యాప్తు చేస్తున్న అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. విధులు దుర్వినియోగం చేసిన రేణుకేష్ ను సస్పెండ్ చెయ్యాలని డీసీపీ డాక్టర్ రోహిణి నివేదిక తయారు చేసి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డికి అందించారని పోలీసు వర్గాలు తెలిపాయి.