డీకే శివకుమార్ అరెస్ట్: చెలరేగిన కార్యకర్తలు, విధ్వంసం, నేడు కర్ణాటక బంద్, భారీ బందోబస్తు
ముంబై: మనీలాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అరెస్టయ్యారు. మంగళవారం రాత్రి 8.38గంటలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. దర్యాప్తునకు సహకరించని కారణంగానే పీఎంఎల్ఏ కింద అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఈడీ అధికారులు తమ కార్యాలయానికి శివకుమార్ను పిలిపించుకుని విచారణ జరుపుతున్నారు.
ట్రబుల్స్లో ట్రబుల్ షూటర్: డీకేను అరెస్టు చేసిన ఈడీ..ఈయన్నైనా కాపాడుకోగలదా..?
ఏ తప్పూ చేయలేదంటూ..
ఈడీ అరెస్టుకు ముందు శివకుమార్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, కేవలం కక్ష సాధింపుతోనే తనను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. చట్టానికి సహకరించడానికి తాను సిద్ధమేనని, అయితే, విచారణకు తనకు కనీస సమయం కూడా ఇవ్వడం లేదని అన్నారు. తాను విచారణకు సహకరిస్తున్నప్పటికీ తనను అరెస్ట్ చేయాలని ఈడీ ప్రయత్నిస్తోందని అన్నారు.
ఈడీ విచారణ..
ఆగస్టు 31న శివకుమార్ ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సోమవారం, మంగళవారం ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని గతంలో శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. కాగా, ఏడాదిన్నర క్రితం శివకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేసి రూ. 8.59కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
విధ్వంసానికి పాల్పడ్డారు..
డీకే శివకుమార్ అరెస్టుతో కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలు చోట్ల బస్సుల అద్దాలను పగలగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. ఐదు కేఎస్సార్టీసీ బస్సులు ఆందోళనకారుల దాడిలో ధ్వంసమయ్యాయి.
నేడు కర్ణాటక బంద్
అంతేగాక, సెప్టెంబర్ 4న (బుధవారం) కర్ణాటక రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు కేపీసీసీ జనరల్ సెక్రటరీ సత్యన్ పుత్తూర్ ఇండియన్ ఎక్స్ప్రెస్.కామ్కు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు పిలుపునిచ్చారు.
కర్ణాటకలో భారీ బందోబస్తు..
ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, గత ప్రభుత్వం మంత్రిగా కొనసాగిన శివకుమార్ అరెస్టుతో ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బుధవారం కూడా ఆందోళనలను కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తును చేపట్టారు. పరిస్థితి అదుపుతప్పకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ బంద్ పిలుపుతో ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.