ఈ విషయం తెలిసి కుప్పకూలిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్..
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఈడీ అదుపులో ఉన్న కర్నాటక కాంగ్రెస్ నేత ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కస్టడీ నేటితో ముగియనుంది. అయితే గురువారం ఆయన కుమార్తె ఐశ్వర్యను ఈడీ విచారణ చేసింది. ఈ విషయం తెలుసుకున్న డీకే శివకుమార్ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినడంతో ఆయన్ను రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. డయోరియా, అధిక రక్తపోటుతో శివకుమార్ బాధపడుతున్నట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. తన కూతురు ఐశ్వర్యను ఈడీ విచారణ చేస్తోందన్న విషయం తెలియగానే డీకే శివకుమార్ ఒక్కసారిగా కూలిపోయినట్లు అక్కడి వారు తెలిపారు.
అగ్రరాజ్యం పై ఇజ్రాయిల్ నిఘా: వైట్హౌజ్ వద్ద లభ్యమైన అతిచిన్న పరికరాలు
ఐశ్వర్యను గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
డీకే శివకుమార్ కూతురు ఐశ్వర్యకు ఈడీ సమన్లు ఇచ్చారన్న విషయం తెలిసిన కాంగ్రెస్ నేత చాలా ఆవేదనకు గురయ్యారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఐశ్వర్య గురువారం చేరుకుని విచారణ అనంతరం ఆమె బెంగళూరుకు తిరిగి చేరుకున్నారు. ఆమెను కొన్ని గంటలపాటు ఈడీ విచారణ చేసింది. అంతేకాదు 2017లో సింగపూర్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే ప్రశ్నలు కూడా ఈడీ సంధించినట్లు తెలుస్తోంది. హవాలా ద్వారా డబ్బులు వెళ్లడం, బినామీ ఆస్తులపై ఐశ్వర్యను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక ఆస్పత్రిలో డీకే శివకుమార్ పరిస్థితిని చూసి షాక్కు గురైనట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
ఒక వర్గం మీడియా కథనాలతో కలత చెందిన డీకే కుటుంబ సభ్యులు
ఇక ఓ వర్గం మీడియా ఈడీ వేసిన ప్రశ్నలు ఇవే అంటూ వరుస కథనాలను ప్రసారం చేయడంతో డీకే శివకుమార్ కుటుంబసభ్యులు కూడా చాలా ఆవేదనకు గురైనట్లు సన్నిహితులు తెలిపారు. సాధారణంగా ఈడీ అడిగే ప్రశ్నలు బయటకు రాకూడదని.... అలాంటప్పుడు మీడియాకు ప్రశ్నలు ఎలా తెలిశాయంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇక శుక్రవారం రోజున డీకే శివకుమార్ను ఈడీ కోర్టు ముందు హాజరుపర్చనుంది. మరో ఐదురోజుల పాటు కస్టడీని పొడగించాల్సిందిగా ఈడీ కోరే అవకాశం ఉంది. ఒక వేళ కోర్టు తిరస్కరిస్తే జ్యుడీషియల్ కస్టడీ విధించే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే డీకే శివకుమార్ కూడా చిదంబరంలానే తీహార్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది.
ఆస్పత్రిలో డీకే శివకుమార్ను పరామర్శించిన సిద్ధరామయ్య
ఇదిలా ఉంటే కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతర నేతలు డీకే శివకుమార్ను హాస్పిటల్లో పరామర్శించారు. అయితే చాలా దూరం నుంచే శివకుమార్ను చూసేందుకు అనుమతించారు. ఆయనతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని నాయకులు చెప్పారు. తమ సెల్ఫోన్లను కూడా తీసుకున్నారని నేతలు చెప్పారు. ఇదిలా ఉంటే కేంద్ర విచారణ సంస్థలను బీజేపీ వినియోగించుకుంటుందని కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేయడం తగదని అన్నారు డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వత్ నారాయణ్. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు.