పోలీసులు, అధికారులు శివకుమార్కు సహకరిస్తున్నారు, కుందగోల్ బై పోల్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
బెంగళూరు : కర్ణాటకలోని కుందగోల్ బై పోల్కు కాంగ్రెస్ నేత, మంత్రి డీ కే శివకుమార్ విచ్చలవిడిగా నగదు పంచుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కుందగోల్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు శివకుమార్ సంచలకొద్దీ నగదు పంచుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక ఎన్నికల సంఘాన్ని కోరింది. నియోజకవర్గంలో ఉంటూ కులసంఘాలు, పలుకుబడి ఉన్నవారికి నగదు పంచుతున్నారని ఆరోపించారు. శివకుమార్ కు పోలీసులు, అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు.
ఇరువురికి ప్రతిష్టాత్మకం ...
కుందగోల్ అసెంబ్లీకి దివంగత మంత్రి సీఎస్ శివాల్లీ ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతితో ఈ నెల 19న ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక్కడినుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శివాల్లీ భార్య బరిలోకి దాగారు. శివాల్లీ .. శివకుమార్ మంచి స్నేహితులు. ఎలాగైన తన స్నేహితుడి భార్యను గెలిపించేందుకు శివకుమార్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకోసమే ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని .. ఇక్కడే మకాం వేశాడని చెప్తున్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. శివకుమార్ పై చర్యలు తీసుకోవాలని .. లేదంటే బీజేపీ అభ్యర్థి విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
స్వయంగా పర్యవేక్షణ ..
కుందగోల్ ఉప ఎన్నికల్లో గెలవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శివకుమార్ .. హుబ్లీలోనే ఉంటున్నారని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. కాటన్ కౌంటీ, హోటల్ డైమన్షన్లో విడిది చేస్తున్నారని తెలపింది. అక్కడినుంచే వివిధసంఘాల నేతలు, స్థానిక నేతలకు కట్టల నగదు పంచుతున్నారని వివరించింది. వారు విచ్చలవిడిగా నగదు పంచడం పోలింగ్ పై ప్రభావం చూపి .. తమ అభ్యర్థి విజయంపై ఎఫెక్ట్ చూపిస్తోందని బీజేపీ నేతలు చెప్తున్నారు. శివకుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పోలీసులు .. అధికారులు కూడా ...
అంతేకాదు అధికారులు, పోలీసులపై శివకుమార్ ప్రభావం చూపిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. మంత్రి ఆదేశాలతో పోలీసులే స్వయంగా నగదు పంచేందుకు వెళ్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ శివకుమార్ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.