రూ. 75 కోట్ల అక్రమాస్తులు: కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్పై సీబీఐ కేసు
బెంగళూరు/న్యూఢిల్లీ: రూ. 75 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినందుకు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై కేసు నమోదు చేసినట్లు సీబీఐ సోమవారం ప్రకటించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో ఆయన ఆస్తులను సోదాలు చేశారు. అయితే, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులు జరుగుతున్నాయని డీకే శివకుమార్ ఆరోపించారు.
కాగా, సోమవారం సీబీఐ అధికారులు విస్తృతస్థాయిలో డీకే శివకుమార్ నివాసాలపై సోదాలు నిర్వహించాయి. సుమారు 60 మంది అధికారులు ఇందులో పాల్గొన్నట్లు తెలిసింది. డీకే శివకుమార్ తోపాటు ఆయన సోదరుడు డీకే సురేష్కు సంబంధించిన నివాసాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి.
అయితే, రాజరాజేశ్వరనగర్, సిరా అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నాయి. ప్రధాని మోడీ, కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారి డీకే శివకుమార్ నివాసంలో సోదాలు చేస్తోదంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేత రణ్ దీప్ సింగ్ సూర్చేవాలా. ఈ కక్షపూరిత రాజకీయాలు తమను ఏమీ చేయలేవని అన్నారు.
Filing a case against me is wrong, I am not the only politician in the state. This is definitely a political conspiracy. They are unable to see me grow. I will cooperate with the system. They want to harass me: Congress leader DK Shivakumar on CBI case against him pic.twitter.com/9iFzKhYOHh
— ANI (@ANI) October 5, 2020
కర్ణాటకలో బీజేపీ సర్కారు అవినీతిని సీబీఐ తొలుత బయటపెట్టాలని సూర్చేవాలా డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా సీబీఐ దాడులను ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత ఏడాది సెప్టెంబర్ నెలలో డీకే శివకుమార్ను ఢిల్లీలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుమారు 50 రోజులపాటు ఆయన జైల్లోనే ఉన్నారు. అనేక అభ్యర్థనల తర్వాత ఆయనకు బెయిల్ లభించడంతో తీహార్ జైలు నుంచి విడులయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు సీబీఐ దాడులు చేయడం గమనార్హం.