కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ కు వరుస కష్టాలు: 85 ఏళ్ల తల్లి, భార్యకు సమన్లు జారీ చేసిన ఈడీ..కస్టడీ పొడిగి
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. మరి కొన్నాళ్ల పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో కొనసాగనున్నారు. ఆయన కస్టడీని ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహర్ ఈడీ అధికారులకు అనుమతి ఇచ్చారు. డీకే శివకుమార్ తల్లి గౌరమ్మ, భార్య ఉషలకు ఈడీ అధికారులు సమన్లను జారీ చేశారు. విచారణను ఎదుర్కొనడానికి ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించారు.
మనీ ల్యాండరింగ్ కేసులో డీకే శివకుమార్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనను దేశ రాజధానిలోని తీహార్ జైలులో ఉంచి విచారిస్తున్నారు అధికారులు. ఇప్పటికే రెండుసార్లు డీకే శివకుమార్ కస్టడీని పొడిగించింది న్యాయస్థానం. శివకుమార్ విచారణకు సహకరించట్లేదని, మరింత కీలక సమాచారాన్ని రాబట్టు కోవాల్సిన అవసరం ఉందని అంటూ ఈడీ అధికారులు రెండురోజుల కిందటే ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ అనిల్ కుమార్ కుహర్.. మంగళవారం ఉదయం వాదోవాదాలను ఆలకించారు.
రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకుడు కావడం వల్ల డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరు చేస్తే.. సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అమిత్ మహాజన్, నితీష్ రాణా, ఎన్ కే మట్టా న్యాయమూర్తికి వివరించారు. తాము మరింత సమాచారాన్ని రాబట్టుకునేంత వరకూ కస్టడీని పొడిగించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై న్యాయమూర్తి అనిల్ కుమార్ కుహర్ సానుకూలంగా స్పందించారు. డీకే శివకుమార్ కస్టడీని 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా డీకే.. మరి కొన్నాళ్ల పాటు తీహార్ కారాగారంలోనే గడపాల్సి వస్తోంది.
కాగా- మనీ లాండరింగ్ కేసులో తాజాగా ఈడీ అధికారులు ఆయన తల్లి గౌరమ్మ, భార్య ఉషలకు సమన్లను జారీ చేయడం కలకలం రేపింది. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లను ఇచ్చింది. దీనిపై గౌరమ్మ భిన్నంగా స్పందించారు. వయస్సు రీత్యా తాను ఢిల్లీకి ప్రయాణం చేయలేనని, ఈడీ అధికారులే బెంగళూరుకు రావాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 85 సంవత్సరాలు. ఇదివరకే మనీ ల్యాండరింగ్ కేసులో డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, సోదరుడు, లోక్ సభ సభ్యుడు డీకే సురేష్, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్ లను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా తల్లి, భార్యకు సమన్లను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.