అమిత్ షాకు సవాల్గా నిల్చిన శివకుమార్: బీజేపీ ఎత్తులను చిత్తు చేశారు
బెంగళూరు: శనివారం సాయంత్రం 4గంటల వరకు ఎంతో ఉత్కంఠకు గురిచేసిన కర్ణాటక రాజకీయాలకు.. చివరకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాతో తెరపడింది. అయితే, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన బీజేపీ చివరకు చేతులెత్తేసింది. ఇందుకు కాంగ్రెస్, జేడీఎస్ అవలంభించిన కట్టుదిట్టమైన వ్యూహాలే కారణంగా కావడం గమనార్హం.
డీకే శివకుమార్ కీలక పాత్ర
కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలకు ఎదురునిలబడి కాంగ్రెస్కు రాజకీయ విజయం అందించడంలో కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఇది అమిత్ షా వ్యూహాలపై శివకుమార్కు రెండో విజయంగా చెప్పవచ్చు.
అహ్మద్ పటేల్ ఎన్నికలోనూ..
గుజరాత్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి రాజ్యసభకు అహ్మద్ పటేల్ను పంపడంలోనూ డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బెంగళూరులో భద్రత కల్పించారు డీకే శివకుమార్. ఈ రెండు విజయాల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ శివకుమార్.. అమిత్ షాకు రెండోసారి షాకిచ్చినట్లు తెలుస్తోంది.దీనికి ముందు విలాస్రావ్ దేశ్ముఖ్కు వ్యతిరేకంగా విశ్వాసతీర్మానం పెట్టిన సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా శివకుమార్ రక్షణ కల్పించడం గమనార్హం.
గాలి, శ్రీరాములుకు ధీటుగా
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ధన బలం, అంగ బలం ఉన్న నేతగా శివకుమార్కు పేరుంది. అందుకే, యడ్యూరప్ప, గాలి సోదరులు, శ్రీరాములు చేసిన ప్రయత్నాలు కూడా బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో కొనసాగేందుకు ఉపయోగపడకపోవడానికి శివకుమారే కారణం కావడం గమనార్హం.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా
బీజేపీ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఇద్దరు ఎమ్మెల్యే(ఆనంద్ సింగ్, ప్రతాప్)లను కూడా చివరకు కాంగ్రెస్ పార్టీలో చేర్చి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్లు కూడా కర్ణాటకలోనే ఉండి బీజేపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించారు.
బీజేపీపై కాంగ్రెస్ తొలి విజయం
ఇది బీజేపీపై కాంగ్రెస్ సాధించిన తొలి రాజకీయ విజయంగా చెప్పవచ్చు. గోవా, మణిపూర్లలో బీజేపీ ఎత్తులకు చిత్తైన కాంగ్రెస్.. కర్ణాటకలో మాత్రం బీజేపీని చాకచక్యంగా అడ్డుకుందని చెప్పవచ్చు. అసలు ప్రలోభ పెట్టేందుకు కూడా బీజేపీకి కాంగ్రెస్ ఇక్కడ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.