రజినీ మంత్రం ఫలించిందా? భేటీ తరువాత మనసు మార్చుకున్న కేప్టెన్: బీజేపీ కూటమితో పొత్తు
చెన్నై: తమిళనాడులో మరిన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి బీజేపీ వేసిన వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది. సీనియర్ నటుడు విజయ్ కాంత్ ఏర్పాటు చేసిన దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం (డీఎండీకే)తో పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని అన్నా డీఎంకే సీనియర్ నాయకుడు, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వెల్లడించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే-పీఎంకే-డీఎండీకే కలిసి పోటీ చేస్తాయని ఆయన తెలిపారు. తమిళనాడులోని కాంచీపురంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ ప్రకటన వెలువడింది.
దేవేగౌడ-రాహుల్ భేటీ: 10 లోక్ సభ స్థానాలు కావాలంటున్న జేడీఎస్: తేలని పొత్తు
రజినీకాంత్ భేటీ ఉద్దేశం అదే..
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను గానీ, తన పార్టీ గానీ పోటీ చేయట్లేదని దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కొద్దిరోజుల కిందటే ప్రకటించారు. ముందు నుంచి కూడా ఆయన బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే వార్తలు వినిపించాయి. గడువు సమీపించిన తరువాత లోక్ సభ ఎన్నికల బరి నుంచి కూడా రజినీకాంత్ తప్పుకొన్నారు. ఇదంతా బీజేపీకి లబ్ది చేకూర్చడానికేననే అభిప్రాయాలు వెలువడ్డాయి.
వాటికి బలం చేకూరుస్తూ, రజినీకాంత్ తన తోటి నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ తో సమావేశం అయ్యారు. రజినీతో భేటీ తరువాత విజయ్ కాంత్ చికిత్స కోసం అమెరికా వెళ్లిపోయారు. అక్కడి నుంచి రాగానే.. అన్నా డీఎంకే-బీజేపీ-పీఎంకే కూటమిలో చేరబోతున్నారనే వార్త అధికారికంగా వెలువడింది. భేటీ సందర్భంగా రజినీ కాంత్ చేసిన సూచనల ప్రకారమే విజయ్ కాంత్ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారని అంటున్నారు.
పొత్తుల పరంగా తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న మరో కీలక పరిణామంగా దీన్ని భావిస్తున్నారు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమితో నటుడు కెప్టెన్ విజయ్కాంత్ నేతృత్వంలోని డీఎండీకే చేతులు కలిపింది. తమ కూటమిలో డీఎండీకే చేరిన విషయాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి ధ్రువీకరించారు. విజయ్కాంత్ సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలతతోపాటు పలువురు నేతలు తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామిని ఆయన నివాసంలో కలిశారు. మరోవైపు ప్రధాని సభా వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్ లో విజయ్కాంత్ ఫొటోను కూడా ముద్రించారు. ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో కొత్తగా చేరిన డీఎండీకేకు నాలుగు నుంచి అయిదు లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.