దాడులు: విజయకాంత్ నిరాహార దీక్ష, కర్నాటకలో రూ.25వేల కోట్ల నష్టం
చెన్నై: కావేరీ నీటి వివాదం నేపథ్యంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. బెంగళూరులో తమిళనాడుకు చెందిన పెద్ద సంఖ్యలో లారీలను, బస్సులను, ఇతర వాహనాలను కన్నడవాసులు దగ్ధం చేశారు.
కర్నాటకలో తమిళుల పైన జరిగిన దాడిని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీ నుంచి డిఎండికె నిరసన చేపట్టనుందని ఆ పార్టీ అధినేత విజయకాంత్ చెప్పారు. స్వయంగా విజయకాంత్ నిరాహార దీక్షకు దిగనున్నారని తెలుస్తోంది.
బెంగళూరులోని తమిళుల హోటళ్లు, దుకాణాలు, వాహనాలపై కొందరు దాడులకు దిగి ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఇటీవల తమిళ యువకుడిపై కన్నడ వ్యక్తి తీవ్రంగా దాడి చేశాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయింది. దీనిపై విజయకాంత్ స్పందిస్తూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులకు నిరసనగా ఈనెల 16 నుంచి చెన్నైలోని కోయంబేడులోని పార్టీ కార్యలయం ఎదుట నిరాహార దీక్షకు దిగనున్నట్లు తెలిపారు.
కాగా, కావేరీ జలాల వివాదం సందర్భంగా తలెత్తిన ఘర్షణలు కర్ణాటకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాల్సిందేనని సుప్రీం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వందలాది మంది ఆందోళనకారులు సోమవారం బెంగళూరులో విధ్వంసం సృష్టించారు.
ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేశారు. తమిళనాడుకు చెందిన బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనల కారణంగా నగరంలోని సాఫ్ట్వేర్ సహా వివిధ రంగాలకు చెందిన సంస్థలు మూతబడ్డాయి. ఈ విధ్వంస కాండ కారణంగా కర్ణాటకకు సుమారు రూ.25వేల కోట్లు నష్టం వాటిలినట్లు అసోచామ్ వెల్లడించింది.