ఆసుపత్రిలో క్యాప్టెన్ విజయ్ కాంత్, క్షేమం అంటున్న డీఎండీకే పార్టీ, ఫ్యాన్స్ ఆందోళన!
Recommended Video
చెన్నై: ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత క్యాప్టెన్ విజయ్ కాంత్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన విజయ్ కాంత్ ను వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
విజయ్ కాంత్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు, డీఎండీకే పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే సాధారణ హెల్త్ చెకప్ కోసం విజయ్ కాంత్ ఆసుపత్రిలో చేరారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని డీఎండీకే పార్టీ కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కొంత కాలం నుంచి విజయ్ కాంత్ పదేపదే అనారోగ్యానికి గురౌతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించిన సమయంలో విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తరువాత విజయ్ కాంత్ మెరీనా బీచ్ లోని కరుణానిధి సమాధి దగ్గరకు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు.
డీఎండీకే పార్టీ కార్యకలాపాలను కొంత కాలం నుంచి విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత, ఆ పార్టీ సీనియర్ నేతలు చూసుకుంటున్నారు. విజయ్ కాంత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి దగ్గర ఆయన అభిమానులు, డీఎండీకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.