తమిళ సమస్య మాత్రమే కాదు: సల్మాన్ఖాన్ ప్రచారంపై డీఎంకే
చెన్నై: శ్రీలంకలో రాజపక్శ తరఫున ప్రచారం చేస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పైన డీఎంకే పార్టీ కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. డీఎంకే పార్టీ అధికార ప్రతినిధి ఇళంగోవన్ మాట్లాడుతూ.. భారత ఫిషర్ మెన్ పైన శ్రీలంక నావీ దాడులు చేస్తోందని గుర్తు చేశారు.
ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ శ్రీలంకకు వెళ్లి రాజపక్స తరఫున ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇది కేవలం తమిళనాడుకు సంబంధించిన విషయం కాదని, భారత్కు సంబంధించిందన్నారు. రాజపక్శకు ప్రచారం చేయడం ద్వారా సల్మాన్ ఖాన్ భారత్ ఫిషర్ మెన్ను పరిగణలోకి తీసుకోలేదని అర్థమవుతోందన్నారు. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు.
కాగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స తరపున ప్రచారం చేయనున్న అంశం వివాదంగా మారిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్లు ఆదివారం శ్రీలంకకు వెళ్లారు. అక్కడ రాజపక్సేకు మద్దతుగా వీరిద్దరూ ప్రచారం చేయనున్నారు.
కాగా, శ్రీలంకలోని తమిళులను చిత్రహింసలకు గురి చేసి హతమార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సకు మద్దతుగా సల్మాన్ ఖాన్ ప్రచారం చేయడంపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఎండిఎంకె అధినేత వైగో సల్మాన్ ఖాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ఓ నమ్మక ద్రోహి అని విమర్శించారు. కాగా, తమిళనాడులో సల్మాన్కు వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
ఇది ఇలా ఉండగా శ్రీలంకలోని కొలంబోలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ నటుడిగా సల్మాన్ ఖాన్ చరిత్రకెక్కనున్నారు. ఈసారి ఎన్నికల్లో అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేకు మద్దతుగా సల్మాన్, జాక్వెలిన్తో పాటు మరో ఐదుగురు బాలీవుడ్ నటులు ప్రచారం చేయనున్నారు.
రాజపక్స కుమారుడు, ఎంపీ నమల్ ప్రచారం కోసం సల్మాన్ను ఆహ్వానించినట్టు స్థానిక వెబ్ సైట్ 'ఏషియన్ మిర్రర్' పేర్కొంది. ఈ మేరకు సల్మాన్ ఆదివారం శ్రీలంక చేరుకున్నట్టు తెలుస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్వదేశం శ్రీలంకే. ఈ మాజీ 'మిస్ శ్రీలంక' రాజపక్స తనయుడు నమల్కు మంచి స్నేహితురాలు. శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జనవరి 8న జరగనున్నాయి.