హిందూ వ్యతిరేక పార్టీని ఓడించాల్సిందే: డీఎంకేపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నిప్పులు
సేలం: ద్రావిడ మున్నెట్ర కళగం(డీఎంకే) పార్టీ హిందువులకు వ్యతిరేకమని బీజీపీ యువ మోర్చ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. అందుకే ఎంకే స్టాలిన్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఒక్క బీజేపీ మాత్రమే అన్ని మతాలను గౌరవిస్తుందని, అన్ని ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తుందని చెప్పారు.
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు ఎంపీ తేజస్వి సూర్య తమిళనాడులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంకేపై విమర్శలు గుప్పించారు.
'డీఎంకే హిందువులకు వ్యతిరేకంగా చెడ్డ, తీవ్రమైన భావజాలాన్ని సూచిస్తుంది. ప్రతి తమిళుడు హిందువుగా గర్వపడాలి. దేశంలో అత్యధిక సంఖ్యలో దేవాలయాలు ఉన్న పవిత్ర భూమి ఇది. తమిళనాడులోని ప్రతి అంగుళం పవిత్రమైనది, కానీ, డీఎంకే హిందువులకు, హిందుత్వానికి వ్యతిరేకం, కాబట్టి మనం ఆ పార్టీని ఓడించాలి "అని బీజేవైఎం రాష్ట్ర సదస్సులో పిలుపునిచ్చారు.
తమ పార్టీ తమిళనాడు, తమిళ భాష స్ఫూర్తిని సూచిస్తుందని బీజేపీ ఎంపీ నొక్కిచెప్పారు. 'భారతదేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను గౌరవించే, ప్రోత్సహించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తమిళం మనుగడ సాగించాలంటే హిందుత్వం గెలవాలి. కన్నడ గెలవాలంటే హిందుత్వం గెలవాలి. బీజేపీ తమిళనాడు, తమిళ భాష ఆత్మను సూచిస్తుంది ' అని తేజస్వి సూర్య వ్యాఖ్యానించారు.
Addressed Tamil Nadu's energetic youth in Salem at @BJYMinTN conference in Raksha Mantri Sri @rajnathsingh's presence
— Tejasvi Surya (@Tejasvi_Surya) February 21, 2021
TN believes in PM Sri @narendramodi's devpt vision. They'll bless BJP-AIADMK with majority in TN
திமுக-வுக்கு குடும்பமே கட்சி பாஜக -வுக்கு கட்சி தான் குடும்பம் pic.twitter.com/parTQ3misj
డీఎంకేకు కుటుంబమే పార్టీ, కానీ, బీజేపీకి మాత్రం పార్టీనే కుటుంబమని అన్నారు. డీఎంకే హిందూ భావజాలానికి ఎప్పుడూ వ్యతిరేకమేనని, వారు అధికారంలో ఉన్నప్పుడు హిందూ సంస్థలు, నమ్మకాలపై దాడి జరిగిందని సూర్య తెలిపారు. అధికారం కోల్పోవడంతోనే వారు హిందూ ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ఈసారి మాత్రం హిందువులు ఆ పార్టీకి తగిన గుణంపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.