మదురైలో అళగిరి దెబ్బ: అన్నాడీఎంకేలో చేరిక ?
మదురై: తమిళనాడులో డీఎంకే పార్టీ ఓటమికి ఆ పార్టీ చీఫ్ కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి పని చేశారని వార్తలు గుప్పుమన్నాయి. తమిళనాడులోని మదురై పరిసర ప్రాంతాల్లోని అన్ని శాసన సభ నియోజక వర్గాల్లో అళగిరి చెప్పిందే వేదం. ఆయన గీచిన గీత దాటి ఎవ్వరూ పని చెయ్యరు.
అంతటి ఫాలో ఉన్న అళగిరి తన తండ్రి కురుణానిధికి చెందిన డీఎంకే పార్టీ నాయకులకు పెద్ద షాక్ ఇచ్చారు. మదురై పరిసర ప్రాంతాల్లో ని 10 శాసన సభ నియోజ వర్గాల్లో పోటీ చేసిన డీఎంకే అభ్యర్థులు 8 చోట్ల ఓడిపోయారు. అందుకు అళగిరి కారణం అని డీఎంకే నాయకులు ఆరోపిస్తున్నారు.
ఎందుకు ఇలా జరిగింది అని డీఎంకే పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. అయితే తాను డీఎంకేని ఓడించడానికి ప్రత్యేకంగా ఏమీ చెయ్యలేదని అళగిరి అంటున్నారు. ఎన్నికలకు ముందు తాము విజయం సాధిస్తామని డీఎంకే అభ్యర్థులు అంటే ఎలా గెలుస్తారో చూస్తా అంటూ అళగిరి అన్నారు.
తాను ఈ సారి డీఎంకేకి ఓటు వెయ్యనని తేల్చి చెప్పారు. కుటుంబ గొడవల కారణంగా1980లో అళగిరిని మదురై వెళ్లి పోవాలని కురుణానిధి సూచించారు. అప్పటి నుంచి మదురై పరిసర ప్రాంతాల్లో అళగిరి పట్టు సాధించారు. తరువాత డీఎంకే అళగిరిని పార్టీ నుంచి వెలివేశారు.
డీఎంకే ఓటమికి అళగిరి అనుచరులు అందరూ కలిసి పని చేసి ఆ పార్టీకి ఆ ప్రాంతంలో నామరూపాలు లేకుండా చేశారని అంటున్నారు. అందు కోసం అళగిరి తన అనుచరులతో కలిసి తండ్రి పార్టీ డీఎంకేని ఓడించడానికి శక్తి వంచన లేకుండా పని చేశాడని చెబుతున్నారు. త్వరలో అళగిరి అన్నా డీఎంకేలో చేరుతారని ప్రచారం జరుగుతుంది.