10శాతం రిజర్వేషన్లపై మద్రాస్ హైకోర్టులో డీఎంకే ఎంపీ పిటిషన్
ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల పేదలకు విద్యా ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కొద్ది రోజుల క్రితం కేంద్రం చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ రాజ్యాంగ సవరణ చట్టంపై మద్రాస్ హైకోర్టులో డీఎంకే కార్యదర్శి రాజ్యసభ ఎంపీ ఆర్ఎస్ భారతి పిటిషన్ దాఖలు చేశారు. బిల్లు కొద్ది రోజుల క్రితమే పార్లమెంటులో పాస్ అయి అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో చట్టంలా మారింది.
ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో అప్పటి వరకు 50శాతంగా ఉన్న రిజర్వేషన్ సీలింగ్ను కొత్త రిజర్వేషన్లు దాటాయి. మొత్తంగా సుప్రీం కోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ దాటినట్లు అయ్యింది. ఇంద్రసహానే కేసులో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తాజా రిజర్వేషన్లపై ఇంద్ర సహానీ తిరిగి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమిళనాడులో ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీలు 10శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అది తమిళ సర్కార్ దీన్ని అమలు చేసేలా కనిపించడం లేదు. ఇప్పటికే 69శాతం రిజర్వేషన్లు తమిళనాడు కల్పిస్తోంది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం ముగిసిన శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయించడం జరిగింది. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 165 మంది ఓటు వేయగా.. వ్యతిరేకంగా 7 మంది ఓటు వేశారు. దీంతో రాజ్యసభలో బిల్లుపాస్ అయ్యింది. అంతకు ముందు బిల్లు లోక్సభలో పాస్ అయ్యింది. అయితే డీఎంకే పార్టీకే చెందిన ఎంపీ కనిమొళి బిల్లును ముందుగా సెలెక్ట్ కమిటీకి పంపాలన్న డిమాండ్ను సభ ముందు ఉంచింది. అయితే దీనిపై ఓటింగ్ జరపగా 155 మంది అనుకూలంగా 18 మంది వ్యతిరేకంగా ఓటువేశారు.