‘విజయ్కాంత్కు కరుణానిధి రూ.500కోట్ల భారీ ఆఫర్’
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు పార్టీల నేతలు. తాజాగా ప్రజాసంక్షేమ కూటమి(పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్-పీడబ్ల్యూఎఫ్) నేత వైగో చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
డీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి డీఎండీకే నేత విజయకాంత్తో కరుణానిధి బేరాలాడారని, ఆయనకు రూ.500 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమేనని ఆశపెట్టారని వైగో ఆరోపణలు చేశారు. కాగా, డీఎండీకేతో పొత్తు కోసం కరుణానిధి చివరి వరకూ ప్రయత్నించిన విషయం తెలిసిందే.
అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ విజయకాంత్ ప్రజాసంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. ఆ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్ పేరును కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైగో మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి.
విజయకాంత్ను డీఎంకే కూటమిలోకి లాక్కోవడానికి కరుణానిధి విశ్వప్రయత్నాలు చేశారని, చివరకు రూ.500 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారని తెలిపారు. కరుణానిధి ప్రయత్నాలేవీ ఫలించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, వైగో వ్యాఖ్యలను విజయకాంత్ సతీమణి ప్రేమలత కూడా ఖండించారు. అసలు డీఎంకే, డీఎండీకేల మధ్య పొత్తు చర్చలు జరగనే లేదని ఆమె శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. వైగో ప్రకటనపై కరుణానిధి కూడా మండిపడుతున్నారు.
శుక్రవారం తన న్యాయవాది ద్వారా వైగోకు లీగల్ నోటీసులు పంపారు. వైగో వెంటనే సదరు వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు. ఆయన ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు.