డీఎంకె ఎంపీ అరెస్ట్.. కొద్ది గంటలకే బెయిల్.. అసలేం జరిగింది..
దళిత సామాజిక వర్గానికి చెందిన న్యాయమూర్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో డీఎంకె రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతిని శనివారం(మే 23) చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది గంటలకే డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.
దళిత హక్కుల సంస్థ ఆది తమిజార్ పెరవై నాయకుడు అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు భారతి అరెస్ట్ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ సమావేశంలో భారతి ఎస్సీ న్యాయమూర్తుల నియామకాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు తేన్యాంపేట్ పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తన అరెస్టుపై భారతి వాదన మరోలా ఉంది. ప్రభుత్వ అవినీతిని బయటపెట్టినందుకే తనపై కక్ష కట్టి జైలుకు పంపించే కుట్ర చేశారని ఆరోపించారు. 'ఆ కార్యక్రమంలో నా స్పీచ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఓ వర్గం బాగా సర్క్యులేట్ చేసింది. దాని గురించి రేపు మాట్లాడుతాను. ఆ ఘటన జరిగిన 100 రోజుల తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. దీనికి కారణం డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం అవినీతిపై నేను విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేయడమే.' అని చెప్పారు.
Recommended Video
అలాగే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కోయంబత్తూరులో బ్లీచింగ్ పౌడర్ను చల్లేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేయడంపై ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నామని చెప్పారు. ఇవన్నీ బయటపడకుండా ఉండేందుకే తనపై లేని ఆరోపణలతో కేసులు బుక్ చేశారని ఆరోపించారు. ఒకవేళ తాను అరెస్ట్ అయినా సరే... మంత్రి వేలుమణిపై ఫిర్యాదు చేసి తీరుతామని స్పష్టం చేశారు.