తమిళనాడు పద్దతే కన్నడలో అమలు: కర్ణాటక పరిణామాలపై స్టాలిన్ ఫైర్
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్ర గవర్నర్ బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్ వాజ్బాయ్ వాలా నిర్ణయాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదన్నారు.
గురువారం నాడు ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. గతంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టుగానే , ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడ కర్ణాటకలోనూ రాజ్యాంగాన్ని అపహస్యం చేశారని స్టాలిన్ ఆక్షేపించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లు కేంద్రం చేతిలో కీలు బొమ్మలుగా మారారని చెప్పారు.
వాజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా ఖండిస్తోందని స్టాలిన్ చెప్పారు. అంతకుముందు ఆయన కర్ణాటక పరిణామాలపై ట్వీట్ చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వనించారు.
ఏకపక్షంగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం పునాదులను నాశనం చేసేదిగ ఉందన్నారు. , ముఖ్యంగా బేరసారాలను ప్రొత్సహించేదిగా ఉందన్నారు. తమిళనాడులోనూ అవినీతి అన్నాడీఎంకేను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ఇలాంటి చేష్టలు రాజ్యాంగ విలువలకు ప్రమాదకారకంగా మారుతున్నాయని స్టాలిన్ ట్వీట్ చేశారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు స్టాలిన్ తెలిపారు.
కర్ణాటక పరిణామాలపై ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని జెడి(ఎస్) చీఫ్ కుమారస్వామి గురువారం నాడు కోరారు.ఈ మేరకు ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడాలని తన తండ్రి దేవేగౌడను కోరనున్నట్టు కుమారస్వామి చెప్పారు. ప్రాంతీయ పార్టీల నేతలు కొందరు ఇప్పటికే కర్ణాటకలో బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వడాన్ని తప్పుబట్టాయి.