తమిళనాడు అసెంబ్లీలో రచ్చ: స్టాలిన్ సస్పెండ్.. దానిపై చర్చ జరగాల్సిందేనని!..
డీఎంకె సభ్యులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరిని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించి.. వారందరినీ బయటకు వెళ్లాల్సిందిగా సూచించారు.
చెన్నై: విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు గాను కోట్ల కొద్ది డబ్బును ఎమ్మెల్యేలకు కుమ్మరించారని అన్నాడీఎంకెపై డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ సహా ఆ పార్టీ సభ్యులంతా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కోర్టు మెట్లెక్కిన ఆయన.. తాజా అసెంబ్లీ సమావేశాల్లోను చర్చకు గట్టి పట్టుబడుతున్నారు.
30 ఏళ్ల తర్వాత ఇలా అవమానం: స్టాలిన్ క్షమాపణ.., అదే జరిగితే...
బుధవారం ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఇదే అంశంపై అట్టుడికాయి. ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభ పెట్టారన్న అంశంపై చర్చ జరగాల్సిందేనని డీఎంకె పట్టుబడింది. అందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ తీరును వ్యతిరేకించారు.
డీఎంకె సభ్యులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరిని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించి.. వారందరినీ బయటకు వెళ్లాల్సిందిగా సూచించారు. అనంతరం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే నేతలు అసెంబ్లీ వెలుపల రహదారిపై ఆందోళన చేపట్టారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
కాగా, జయలలిత మరణానంతరం శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య జరిగిన రాజకీయాల్లో.. ఎమ్మెల్యేలను తనవైపు నిలుపుకోవడంలో చిన్నమ్మ విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్యాంపు రాజకీయాల ద్వారా ఎమ్మెల్యేలందరిని ఒక్కచోట చేర్చిన ఆమె.. పట్టు జారిపోకుండా జాగ్రత్తపడ్డారు. ఇదే క్రమంలో తన అనుయాయి పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.
ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి నెగ్గడంతో.. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే పళనిస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గారని డీఎంకె ఆరోపిస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలోను చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తోంది.