త్వరలో తమిళనాడులో ఎన్నికలు: బిజెపి నేత సంచలనం
పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం మరో వారం రోజులైనా ఉంటుందా అన్న అనుమానం కలుగుతోందని డిఎంకే చీఫ్ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
చెన్నై: పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం మరో వారం రోజులైనా ఉంటుందా అన్న అనుమానం కలుగుతోందని డిఎంకే చీఫ్ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అప్పటి వరకు పళనిస్వామి ప్రభుత్వం ఉండేలా కనిపించడం లేదన్నారు. కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉంటే, తమ పని తాము చేసుకుపోతుంటామన్నారు.
ఇప్పటికే అన్నాడీఎంకే మూడు ముక్కలైందని, ఇంకా ఎన్ని ముక్కలుగా మారుతుందో ఊహించడం కష్టమన్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే, సుపరిపాలనను ప్రజలకు చూపిస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో నీటిని నిల్వ ఉంచేలా ట్యాంకులు, చెరువులను నిర్మిస్తామన్నారు. భవిష్యత్తులో అధికారం డీఎంకేదేనన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే ఇంకా ఎన్ని చీలికలు పేలికలవుతుందోనని స్టాలిన్ ఎద్దేవా చేయగా, రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ జోస్యం చెప్పారు.
కాగా, అధికార అన్నాడీఎంకేలో వర్గపోరు వేడెక్కుతోంది. ఇప్పటికే శశికళ, పన్నీర్సెల్వం వర్గాలుగా చీలిన పార్టీలో తాజాగా మరో చీలిక ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
తనను పార్టీ నుంచి తొలగించడాన్ని ప్రశ్నిస్తున్న టీటీవీ దినకరన్... ముఖ్యమంత్రి పళనిస్వామి వెంట ఉన్న ఎమ్మెల్యేలను తన పక్షాన చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
దినకరన్ను ఇప్పటికే పార్టీ నుంచి దూరం చేశామని పళనిస్వామి వర్గం చెబుతుండగా మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున ఆయన నివాసానికి వెళ్లి మద్దతు పలికారు. 30 మంది శాసనసభ్యులు వచ్చి కలిశారని ఒక శాసనసభ్యుడు ప్రకటించగా, దినకరన్కు 60 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని మరో నేత చెప్పారు.