కావేరీ సమస్య: నిర్మలా సీతారామన్ కాన్వాయ్పై డిఎంకె రాళ్ళ దాడి
చెన్నై: కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్పై డిఎంకె కార్యకర్తలు రాళ్ళు, చెప్పులతో బుధవారం నాడు దాడి చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని రామ్నాథ్పురంలో డిఎంకె కార్యకర్తలు, బిజెపి వలంటీర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
కావేరీ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించకపోవడంతో డిఎంకె కార్యకర్తలు బిజెపి తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడు రాష్ట్ర పర్యటనకు బుధవారం నాడు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్పై రాళ్ళు, చెప్పులతో దాడికి దిగారు. డిఎంకె కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలకు మద్య వాగ్వాదం చోటు చేసుకొంది.
పోలీసులు తాళ్లు అడ్డ పెట్టి వారిని ముందుకు రాకుండా అడ్డుకున్నారు. పార్దీబనూర్ జంక్షన్ వద్దకు సీతారామన్ కాన్వాయ్ రాగానే బీజేపీ కార్యకర్తలు డీఎంకే ఆందోళనకారులతో వాదానికి దిగారు. ఈలోపు కాన్వాయ్ ముందుకు కదలడంతో డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పులు విసిరారు.
అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన తమ కార్యకర్తలను బీజేపీ వలంటీర్లు రెచ్చగొట్టారంటూ డీఎంకే జిల్లా కార్యదర్శి దివాకరన్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ పథకమైన 'గ్రామ్ స్వరాజ్ అభియోన్' అమలును సమీక్షించేందుకు ఒకరోజు పర్యటన కోసం నిర్మలా సీతారామన్ ఇక్కడకు వచ్చారు. మారుమూల దళిత గ్రామాలైన కల్లికుడి, కయలూర్లను ఆమె సందర్శించనున్నారు.