టిక్ టాక్ స్ధానంలో పుట్టగొడుగుల్లా స్వదేశీ యాప్లు- లోటు భర్తీ చేయకపోతే మరో విదేశీ ముప్పు...
గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై దాడి తర్వాత చైనాకు చెందిన యాప్లపై కేంద్ర ప్రభుత్వం వరుసగా నిషేధం విధిస్తోంది. అదే సమయంలో వీటి స్ధానంలో దేశీయ యాప్ల తయారీని ప్రోత్సహిస్తోంది. కానీ చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్ధకు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ స్ధానంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వందలాది యాప్లు ఆ లోటు భర్తీ చేయడంలో సఫలమవుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వస్తున్నా మెజారిటీ జనం మాత్రం టిక్ టాక్ లేని లోటు కనిపిస్తోందని చెబుతున్నారు. టిక్ టాక్ స్ధాయిని అందుకునేందుకు ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
Recommended Video
టిక్ టాక్ నిషేధం తర్వాత..
చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్ధ సృష్టించిన టిక్ టాక్ యాప్ భారత్తో పాటు పలు దేశాల్లో సంచలనాలు రేపింది. అనతికాలంలోనే కోట్ల కొద్దీ డౌన్లోడ్లతో యూత్ను ఓ ఊపు ఊపింది. అయితే గల్వాన్ లోయ ఘటన తర్వాత చైనా యాప్లపై కేంద్రం విధించిన నిషేధంతో భారత్లో టిక్టాక్ కనుమరుగైంది. అదే సమయంలో కేంద్రం ప్రోత్సాహంతో టిక్టాక్ను పోలిన వందల కొద్దీ యాప్లు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. వీటి విషయంలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా మేకిన్ ఇండియా ప్లాన్లో భాగంగా స్వదేశీ ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయని చెప్పవచ్చు. గతంలో దీనిపై అంతగా దృష్టిపెట్టని స్టార్టప్ సంస్ధలు కూడా ఇప్పుడు వీడియో షేరింగ్ యాప్లకు ఉన్న ఆదరణను గుర్తిస్తున్నాయి.
టిక్టాక్ లేని లోటు భర్తీ..
ఈ ఏడాది ఏప్రిల్ 29న టిక్టాక్పై నిషేధం విధించే నాటికి భారత్లో ఆ యాప్ డౌన్ లోడ్ల సంఖ్య అక్షరాలా 61 కోట్లు. కానీ ఇప్పటికీ వందల కొద్దీ దేశీయ యాప్లు పుట్టుకొస్తున్నా అవన్నీ కలిపి కూడా ఈ నంబర్ అందుకులేని పరిస్ధితి కనిపిస్తోంది. అంటే టిక్టాక్ లేని లోటును భర్తీ చేసేందుకు ఇంకా పూర్తి స్ధాయిలో ప్రయత్నాలు జరగడం లేదని అర్ధమవుతోంది. దేశీయ సంస్ధలు తయారు చేస్తున్న యాప్లు ఇక్కడి యువతను టిక్టాక్ స్ధాయిలో ఆకట్టుకోలేక పోవడం వల్లే డౌన్ లోడ్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టిక్ టాక్ను యథాతథంగా కాపీ చేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. భారత్లో వీడియో షేరింగ్ రంగంలో ఉన్న అవకాశాలకు ఇదో చక్కని ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు.
కేంద్రం వ్యూహాత్మక నిషేధం..
టిక్టాక్ తో పాటు పలు చైనా యాప్లను కేంద్రం నిషేధించడం వెనుక పలు వ్యూహాత్మక కారణాలున్నట్లు తెలుస్తోంది. వీటిలో పైకి జాతీయ భద్రత, చైనాపై ఆగ్రహం వంటి అంశాలు తెరపైకి వచ్చినా స్వదేశీ మంత్రం మాత్రం అంతగా ప్రచారం కాలేదు. కానీ లాక్డౌన్ కారణంగా దేశంలో రాజ్యమేలుతున్న చైనా యాప్లను గల్వాన్ ఘటన పేరుతో కేంద్రం వదిలించుకుందని సమాచారం. ఇదే అదనుగా భారతీయ కంపెనీలను స్వదేశీ మంత్రంతో ప్రోత్సహించాలని, భవిష్యత్తులో వీటిలో కొన్ని సఫలమైనా దేశ ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుందని కేంద్రం భావించింది. ఇప్పుడు ఇదే అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. భారతీయ యాప్ల రాకతో దేశంలో ఉద్యోగవకాశాలు మరింత మెరుగుపడతాయని కేంద్రం అంచనా వేస్తోంది.
టిక్ టాక్ స్ధానంలో విదేశీ ముప్పు..
గల్వాన్ ఘటన పేరుతో టిక్ టాక్ వంటి చైనీస్ యాప్లను కేంద్రం వదిలించేసుకున్నా వాటి స్ధానంలో భారతీయ యాప్లు వృద్ధి చెందకపోతే ఇతర విదేశీ యాప్లు వాటి స్ధానాన్ని భర్తీ చేసే ప్రమాదముందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే చైనా స్ధానంలో ఎలాగో మేకిన్ ఇండియాతో పాటు విదేశీ సంస్ధలను భారత్ ప్రోత్సహించక తప్పదు. అప్పుడు వాటితో ఎలాగైనా దేశీయ సంస్ధలు పోటీ పడాల్సి ఉంటుంది. ఈ పోటీలో భారతీయ సంస్ధలు విఫలమైతే టిక్ టాక్ తరహాలోనే మరో విదేశీ యాప్ ఆ స్ధానాన్ని కైవసం చేసుకోవడం ఖాయం. అప్పుడు స్వదేశీ కోసం కేంద్రం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల వెనుక శ్రమంతా వృధా అవుతుంది.