పార్లమెంట్ కు డుమ్మా కొట్టొద్దు..! కోరం ఉంటేనే సభ రసవత్తరంగా ఉంటుందన్న మోదీ..!!
ఢిల్లీ/హైదరాబాద్ : శాసనాలు చేసే చట్ట సభలకు ప్రజా ప్రతినిధులు డుమ్మా కొడితే ఎబ్బెట్టుగా ఉంటుందని, అలా కాకుండా సభ్యులందరూ చట్టసభలకు హాజరైతే ఆ మజా వేరుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. చట్ట సభలకు ఎన్నికైన ప్రతినిధులు విధిగా సభలకు హాజరైతే హుందాగా ఉంటుందని, రాజకీయ పార్టీల చర్చల్లో పాల్గొంటే ఆ కిక్కు వేరేలా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం, ఇచ్చిన హామీల అమలుకోసం చట్టాలు ఎలా రూపొందుతాయో, వాటిలో ఎలా భాగస్వామ్యం అవ్వాలో తెలియాలంటే విధిగా సభలకు హాజరు కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రజా స్వామ్యంలో ప్రజా పక్షాన పోరాటం ఎంత ముఖ్యమో చట్టసభలకు హాజరవ్వడం కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయాన్ని మోదీ వ్యక్తం చేసారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవంతిలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు.
మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురాబోయే కీలకమైన బిల్లులకు సంబంధించి మోడీ, త్ షా పార్టీ నాయకులకు వివరించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీలు హాజరుకావాల్సిందే అని.. ఎవ్వరుకూడా డుమ్మా కొట్టకూడదని సూచించారు. పార్లమెంట్ సమావేశాల గైర్హాజరును పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని చెప్పారు. బీజేపీ ఎంపీలు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుండాలని ప్రధాని మోడీ సూచించారు. బీజేపీ ఎంపీలుగా గెలిచినవారిలో ఎక్కువమంది కొత్తవాళ్లే ఉన్నారని, ప్రజల అభిప్రాయాలకు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కేంద్రం పథకాలు మారుమూల పల్లెలకు చేరేలా ఎంపీలే బాధ్యత తీసుకోవాలని సూచించారు.