నా తల్లిని వేధించకండి..! బీజేపి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న వాద్రా..!!
జైపూర్/హైదరాబాద్ : రాబర్ట్ వాద్రా పై వరుస విచారణలు కొనసాగుతున్నాయి. అక్రమంగా ఆస్తుల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరో కేసులో విచారణ నిమిత్తం నేడు జైపూర్కు చేరుకున్నారు. విచారణ నిమిత్తం వాద్రాతో పాటు ఆయన తల్లి మౌరీన్ వాద్రాను సైతం హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. దీంతో వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని వేధించాల్సిన అవసరం ఏముందంటూ రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ వేదికగా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్లుగా గుర్తుకురాని అవినీతి, ఎన్నికల సమయంలోనే ఎందుకు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. ''ఈడీ ఎదుట హాజరయ్యేందుకు నేను మా అమ్మ జైపూర్కు చేరుకున్నాం. కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం.. వయోభారంతో బాధపడుతున్న నా తల్లిని ఎందుకు వేధిస్తుందో అర్థం కావడం లేదు. అని అర్థించారు వాద్రా.
రోడ్డు ప్రమాదంలో కుమార్తెను, డయాబెటిస్తో భర్తను, ఓ కుమారుడిని కోల్పోయి బాధపడుతున్న నా తల్లికి తోడుగా ఉండడం కోసం నాతో పాటు ఆఫీసుకు రమ్మన్నాను. దీని ద్వారా తనకు కొంత ఊరట లభిస్తుందని ఆశించాను. నాతో ఆఫీసులో ఉన్నందుకు గానూ ఇప్పుడు ఆమెపై కూడా నేరాలు మోపి విచారిస్తున్నారు. ఇప్పటికే నన్ను మూడు రోజుల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఏదైనా చట్ట విరుద్ధంగా జరిగిందని మీరు భావిస్తే ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల పాలనలో కాకుండా.. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక నెల ముందు ఎందుకు విచారిస్తున్నారు.
ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోరని మీరు భావిస్తున్నారా? నేను ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడే ప్రవర్తించాను. దేవుడు మాతో ఉన్నాడు. ఎంతటి విచారణనైనా ఎదుర్కొంటాను. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను'' అని ఫేస్బుక్లో రాబర్ట్ వాద్రా రాసుకొచ్చారు. లండన్లో ఆస్తుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాద్రా, విచారణ నిమిత్తం దిల్లీలో ఇప్పటికే మూడుసార్లు ఈడీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే.