సుప్రీంకోర్టు కీలక నిర్ణయం : అయోధ్య మధ్యవర్తిత్వానికి మీడియా దూరం ... కారణాలివే ..?
హైదరాబాద్ : అయోధ్య భూ వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇష్యూని పరిష్కరించేందుకు ముగ్గురితో కమిటీ వేసిన సర్వోన్నత న్యాయస్థానం .. విచారణ వివరాలను వెల్లడించకూడదని స్పష్టంచేసింది. ఎన్నో ఏళ్లుగా విచారణ జరుగుతోన్న సున్నితమైన అయోధ్య భూ వివాదం కేసును సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఖలిపుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వ కమిటీ వేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచ్ కమిటీ సభ్యులుగా ఉంటారు.
కారణమిదే ..? ఎన్నికల షెడ్యూల్ ఆలస్యంపై ఈసీ ..
మీడియా దూరం .. కారణమిదీ ..?
ఉన్నది ఉన్నట్టు చూపించే మీడియా ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. తమ తమ టీఆర్పీ రేటింగుల కోసం లేనిది ఉన్నట్టుగా .. అభూత కల్పనలు జోడించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మీడియా అతిపై చాలా సందర్భాల్లో కోర్టులు మొట్టికాయలు వేశాయి. అయినా వారి తీరు మారలేదు. సంచలనాల కోసం పాకులాడే మీడియా టైకున్లు తమ సంస్థ ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలని తహతహలాడుతుంటారు. కానీ వాస్తవం ఏంటీ ? జరిగిన ఘటన నిజమేనా ? సంబంధిత వ్యక్తి అబద్ధం చెప్తున్నారా అని గమనించే సోయి ప్రస్తుత మీడియా సంస్థలకు ఇసుమంత కూడా లేవు. ఈ పరిమాణాలన్నీ గమనించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలో ధర్మాసనం అత్యంత సున్నితమైన అయోధ్య భూ వివాద మధ్యవర్తిత్వ కేసు విచారణ వివరాలను మీడియాకు వెల్లడించొద్దని తేల్చిచెప్పింది.
అభూత కల్పన .. లేనిది ఉన్నట్టు చిత్రీకరణ ... ఇదీ మీడియా నైజం
సమాజంలో జరుగుతోన్న చెడును చూపించాలి. కానీ దానికి పరిమితులు ఉన్నాయి. పిల్లలు, మహిళల ఫొటో, వీడియోలు చూపించొద్దు. వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించొద్దు. కానీ ఇప్పుడు అలాంటి సిచుయేషన్ లేదు. ఏదైనా వార్త వస్తే నిజ నిజాలేంటో చూడటం లేదు. తామే ముందు ప్రజలకు చూపించాలన్న తాపత్రయంతో వార్తలను టెలికాస్ట్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేసి .. క్షమాపణలు కూడా చెప్పిన ఘటనలు ఉన్నాయి. దీంతోపాటు కోర్టులు, మానవ హక్కల కమిషన్, లేబర్ కమిషన్ కూడా రియాక్టైనా ఘటనలు ఉన్నాయి.
ఆంక్షలు ఎందుకంటే ?
సాధారణంగా ఏదైనా ఘటన జరిగితే మీడియాకు సమాచారం ఉంటుంది. కానీ అయోధ్య భూ వివాద కోసం నియమించిన మధ్యవర్తిత్వ కమిటీకి మాత్రం సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. 4 వారాల్లో విచారణను ఫైజాబాద్ లో ప్రారంభించాలని స్పష్టంచేసింది. విచారణ క్రమాన్ని వీడియో రికార్డ్ చేయాలని ప్యానెల్ ను ఆదేశించింది. కానీ తమ విచారణ క్రమాన్ని .. మీడియాకు ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించొద్దని తేల్చిచెప్పంది. సున్నితమైన అయోధ్య కేసు హిందూ, ముస్లింల మధ్య ఏళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ సమయంలో మధ్యవర్తిత్వ విచారణ క్రమాన్ని ఏ చిన్న అంశం బయటకుపొక్కినా .. గొరంతను కొండంత చేసే మీడియా వదలదు. దీంతో తమ చివరి ప్రయత్నం మధ్యవర్తిత్వం కూడా బెడిసి కొడుతోందని సర్వోన్నత న్యాయస్థానం భావిచింది. అందుకోసమే విచారణ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని .. ఏ చిన్న అంశాన్ని కూడా బయటకు వెల్లడించొద్దని నొక్కి వక్కానించింది.
విచారణపై ఉత్కంఠ ..
అయోధ్య భూ వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ఆంక్షలు విధించగా .. విచారణపై ఉత్కంఠ నెలకొంది. నెలరోజుల్లో విచారణ ప్రక్రియను ప్యానెల్ ప్రారంభించాల్సి ఉంటుంది. అదీ కూడా వివాదాస్పద స్థలం వద్దే ... ఎంక్వైరీ మొదలైన 8 వారాల్లో నివేదిక సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అక్కడున్న స్థానికులు, వారి పూర్వికులకు సంబంధించి వివరాలు, ఆధారాలను సేకరిస్తారు. దీంతోపాటు కేసు వేసిన సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా, నిర్మోహి అఖాడా సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుంటారు. వీరందరి అభిప్రాయాలను క్రోడికరించి .. పూర్తి నివేదకను రూపొందించి సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు కు అందజేస్తారు. అయితే విచారణ క్రమంలో .. సాక్ష్యాధారాల కోసం విచారణ సమయాన్ని పొడిగించే అవకాశాలు లేకపోలేదు. మొత్తంమీద విచారించి నివేదిక రూపొందించడానికి దాదాపు 4 నెలల సమయం పడుతోంది. నివేదికను పరిశీలించి .. మధ్యవర్తిత్వం సూచించిన విధంగా భూమి పంచుకోవాలని సంస్థలకు సర్వోన్నత న్యాయస్థానం సూచిస్తోంది. అయితే ఇందుకు అవీ అంగీకరిస్తే .. ఓకే లేదంటే భూ వివాదం మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.